Narendra Modi: మే మొదటి వారంలో ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధాని మోదీ

  • ఏపీలో మే 13న ఎన్నికలు
  • ఇప్పటికే ఓసారి రాష్ట్రానికి వచ్చిన మోదీ
  • ఈసారి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో ప్రధాని పర్యటన
  • మే 3, 4 తేదీల్లో విస్తృత స్థాయిలో సభలు, రోడ్ షోలకు హాజరు 
PM Modi will come to AP in May first week

ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ కూటమికి మద్దతుగా ఇప్పటికే చిలకలూరిపేట సభకు హాజరయ్యారు. కాగా, ఆయన మరో విడత ఏపీలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. 

మే మొదటి వారంలో ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నట్టు బీజేపీ హైకమాండ్ తెలిపింది. మే 3, 4 తేదీల్లో ఏపీలో ప్రధాని పర్యటన ఉంటుందని వెల్లడించింది. ప్రధాని మోదీ రెండ్రోజుల పాటు విస్తృత స్థాయి పర్యటనకు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో, ఆయన పాల్గొనే సభలు, రోడ్ షోలపై ఏపీ బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. 

ఈ నెల 25తో ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా, ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాలని కూటమి నిర్ణయించింది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉత్సాహంగా ప్రచారం చేస్తుండగా, ప్రధాని మోదీ కూడా వస్తే కూటమిలో మరింత జోష్ వస్తుందని భావిస్తున్నారు. 

ప్రధాని పర్యటించే ఆ రెండ్రోజుల పాటు ఆయన వీలైనన్ని ఎక్కువ సభల్లో పాల్గొనేలా రోడ్ మ్యాప్ రూపొందించడంపై కూటమి నేతలు కసరత్తులు చేస్తున్నారు. కాగా, మోదీ పర్యటన అనంతరం, కేంద్రం నుంచి మరికొందరు స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూటమి నేతలు చెబుతున్నారు.

More Telugu News