bluewhale: అమెరికాలో భారత విద్యార్థి మృతికి ‘బ్లూవేల్ చాలెంజే’ కారణమట!

  • 2 నిమిషాలకు మించి ఊపిరిబిగపట్టడం వల్ల మరణించాడన్న అధికార వర్గాలు
  • ఆత్మహత్య కోణంలోనే దర్యాప్తు చేస్తున్నామన్న బ్రిస్టల్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ప్రతినిధి
  • 2017లోనే ఈ ఆన్ లైన్ ఆటను సూసైడ్ గేమ్ గా పేర్కొన్న భారత ప్రభుత్వం

blue whale game likely behind death of indian student in us

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యుసెట్స్ లో ఓ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఇటీవలి ఆత్మహత్యకు ప్రమాదకర బ్లూవేల్ చాలెంజ్ అనే ఆన్ లైన్ గేమే కారణమని ఐఏఎన్ ఎస్ వార్తాసంస్థ పేర్కొంది. సూసైడ్ గేమ్ గా కూడా పిలిచే ఈ ఆటను 20 ఏళ్ల ఆ యువకుడు ఆడుతూ మార్చి 8న బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని కుటుంబం కోరిక మేరకు ఆ యువకుడి పేరును అధికారులు బయటపెట్టలేదు. 

ఈ కేసుపై ఆత్మహత్య కోణంలోనే దర్యాప్తు చేపడుతున్నట్లు బ్రిస్టల్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ప్రతినిధి గ్రెగ్ మిలియోట్ పేర్కొన్నారు. అయితే ఆ యువకుడు హత్యకు గురయ్యాడంటూ మీడియాలో తొలుత విస్తృతంగా కథనాలు వచ్చాయి. అలాగే ఆ విద్యార్థిని బోస్టన్ యూనివర్సిటీ స్టూడెంట్ గా తప్పుగా పేర్కొన్నాయి. అతన్ని దోపిడీ దొంగలు దోచుకున్నారని... యువకుడి మృతదేహం అడవిలో దొరికిన కారులో లభ్యమైందని వెల్లడించాయి. బోస్టన్ గ్లోబ్ న్యూస్ పేపర్ ఆ యువకుడి పేరును ఆ తర్వాత గుర్తించింది. 

ఏమిటీ గేమ్?
బ్లూవేల్ చాలెంజ్ అనేది ఒక ఆన్ లైన్ గేమ్. దీన్ని ఆడేవారికి సాహసాలు చేయాలని నిర్వాహకులు సూచిస్తారు. అయితే 50 లెవల్స్ దాటాక వాటిని చేయడం ఎంతో కష్ట సాధ్యమవుతుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఆ యువకుడు రెండు నిమిషాలకన్నా ఎక్కువ సేపు ఊపిరి బిగపట్టడం వల్ల మరణించాడు. భారత ప్రభుత్వం ఈ గేమ్ ను కొన్నేళ్ల కిందటే బ్యాన్ చేయాలని అనుకున్నప్పటికీ చివరకు దీన్ని ఆడేవారికి కఠిన సూచనలు చేయడం వరకే పరిమితమైంది. “బ్లూవేల్ గేమ్ (ద సూసైడ్ గేమ్) ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంది” అని 2017లో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ అడ్వయిజరీ జారీ చేసింది. ఈ గేమ్ అందుబాటులోకి వచ్చిన ఏడాది తర్వాత యూజర్లకు ఈ హెచ్చరికలు చేసింది.

డాక్టర్ తుది అభిప్రాయం కోసం నిరీక్షణ
యువకుడి మృతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించగా  బ్రిస్టల్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ప్రతినిధి గ్రెగ్ మిలియోట్ స్పందిస్తూ “దీని గురించి మా వద్ద సమాచారం లేదు. దీన్ని ఆత్మహత్యగానే భావించి దర్యాప్తు చేపడుతున్నాం. కేసును మూసేసే ముందు డాక్టర్ తుది అభిప్రాయం గురించి వేచిచూస్తున్నాం” అని బదులిచ్చారు. అయితే మార్చి 22న డాక్టర్ అభిప్రాయం కోరామని.. శుక్రవారం వాయిస్ కాల్ మెసేజ్ సైతం చేశామని చెప్పారు. అయినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదన్నారు.

స్వీయ హానికి ప్రేరేపిస్తుంది
కొన్ని కథనాల ప్రకారం ఈ ఆటను సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై ఆడుతున్నారు. ఇందులో ఒక పార్టిసిపెంట్, ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. రోజుకో టాస్క్ చొప్పున అడ్మినిస్ట్రేటర్ 50 రోజులపాటు చేయాల్సిన పనులు చెబుతాడు. ఆట మొదట్లో ఈ టాస్క్ లు సులువుగానే ఉన్నప్పటికీ ఆడుతున్నకొద్దీ కఠినంగా మారతాయి.  గేమ్ తుది దశలో ఆటగాళ్లు తమకు తాము హాని చేసుకొనేలా ఉంటుంది.

More Telugu News