Lok Sabha Polls: లోక్‌సభ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు వేయనున్న 16 కోట్ల మంది

  • దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో మొదలైన ఓటింగ్
  • పకడ్బందీ ఏర్పాట్లు, పటిష్ఠ భద్రత మధ్య కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ
  • 1625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్న 16 కోట్ల మంది ఓటర్లు
first phase of Lok Sabha polls started all over country

ఎన్నికల మహా సంగ్రామంలో కీలక ఘట్టం మొదలైంది. లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది. పకడ్బందీ ఏర్పాట్లు, పటిష్ఠ భద్రత మధ్య ఓటర్లు ఓటు వేస్తున్నారు. మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏకంగా 18 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల సంఘం రంగంలోకి దించింది. నేడు జరుగుతున్న ఈ ఓటింగ్‌లో మొత్తం 16 కోట్ల మంది ఓటర్లు 1,625 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

7 దశల లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఈ దశలోనే ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో 92 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా నేడు పోలింగ్ కొనసాగుతోంది. తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్‌ సహా పలువురు పాప్యులర్ రాజకీయ నేతలు ఉన్నారు. 

కాగా నేడు ఓటు వినియోగించుకోనున్న 16.63 కోట్ల మందిలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది మహిళలు, 11,371 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. 35.67 లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓట్లు వేయబోతున్నారు. ఇక 85 ఏళ్లు పైబడిన వారు 14.14 లక్షల మంది నమోదిత ఓటర్లుగా ఉన్నారు.

తమిళనాడు (39), రాజస్థాన్ (12), ఉత్తరప్రదేశ్ (8), మధ్యప్రదేశ్ (6), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయ (2) రాష్ట్రాల్లోని అన్ని స్థానాలకు తొలి దశలో భాగంగా నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. అండమాన్-నికోబార్ దీవులు (1), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), సిక్కిం (1), లక్షద్వీప్ (1).. అసోం, మహారాష్ట్రలో 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్‌లో 2, త్రిపుర, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కో సీటుకు నేడు పోలింగ్ జరుగుతోంది.

More Telugu News