Rohit Sharma: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు టీమ్ సెల‌క్ష‌న్ వార్త‌ల‌పై స్పందించిన‌ రోహిత్ శ‌ర్మ

  • అజిత్ అగార్క‌ర్‌, రాహుల్ ద్ర‌విడ్‌తో తాను భేటీ అయిన‌ట్లు వచ్చిన వార్త‌ల్లో నిజం లేద‌న్న రోహిత్‌
  • బీసీసీఐ చీఫ్ సెల‌క్ట‌ర్ అగార్క‌ర్ దుబాయ్‌లో ఉన్నాడ‌ని వెల్ల‌డి
  • కోచ్ ద్ర‌విడ్ పిల్ల‌ల‌తో బెంగ‌ళూరులో గ‌డుపుతున్నాడన్న హిట్‌మ్యాన్‌
  • తాము అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన‌ప్పుడు మాత్ర‌మే నమ్మాల‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
Every thing is Fake Rohit Sharma on T20 World Cup Team Selection

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు టీమ్‌ను సెలక్ట్ చేసేందుకు తాను, బీసీసీఐ చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్‌, కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ముంబైలో భేటీ అయిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందించాడు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేద‌ని కొట్టిపారేశాడు. జ‌ట్టు ఎంపిక విష‌య‌మై తాము అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన‌ప్పుడు మాత్ర‌మే అవి నిజాల‌ని నమ్మాల‌ని చెప్పుకొచ్చాడు. 

"అదంతా ఫేక్ న్యూస్‌. నేనెవ‌రినీ క‌ల‌వ‌లేదు. అగార్క‌ర్ గోల్ఫ్ ఆడేందుకు దుబాయ్ వెళ్లాడు. ద్ర‌విడ్ బెంగ‌ళూరులో పిల్ల‌ల‌తో గ‌డుపుతున్నాడు. అయితే, త‌న కుమారుడి కోసం బ‌హుశా ముంబై వ‌చ్చి ఉంటాడు. ఎర్ర‌మ‌ట్టి పిచ్‌పై ఆడించేందుకు ఇక్క‌డికి తీసుకువ‌చ్చి ఉంటాడు. అంతే.. అంత‌కుమించి ఏమీ లేదు. మేం అస‌లు ఒక‌రినొక‌రు క‌లుసుకోలేదు. ఏదైనా కీల‌క స‌మాచారం ఉంటే మా ముగ్గురిలో ఎవ‌రో ఒక‌రం అంద‌రికీ తెలియ‌జేస్తాం" అని హిట్‌మ్యాన్ వెల్ల‌డించాడు. 

"తాను గానీ, ద్ర‌విడ్ గానీ, అజిత్ అగార్క‌ర్ గానీ లేకుంటే బీసీసీఐ స్వ‌యంగా స్పందిస్తేనే అవి నిజాలు. మిగ‌తావ‌న్నీ అబ‌ద్ధాలు" అని రోహిత్ శ‌ర్మ చెప్పుకొచ్చాడు. క్ల‌బ్ ప్రైరీ ఫైర్ అనే పాడ్‌కాస్ట్‌లో ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్‌ మైకేల్ వాన్‌, ఆస్ట్రేలియా దిగ్గ‌జం ఆడం గిల్‌క్రిస్ట్‌ల‌తో మాట్లాడుతూ హిట్‌మ్యాన్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు.

More Telugu News