Varla Ramaiah: బోండా ఉమను ఇరికించే కుట్ర.. ఏపీ సీఈవో మీనాకు వర్ల రామయ్య ఫిర్యాదు

  • సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై విమర్శలు
  • సీఈవోకు మెసేజ్ పెట్టామని, ఆయన ఇంకా స్పందించలేదని వివరణ
  • ఏపీ డీజీపీకి కూడా మెసేజ్ చేశామన్న వర్ల రామయ్య
TDP Leader Varla Ramaiah Complaint To AP CEO Meena

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తమ పార్టీ నేత, విజయవాడ అభ్యర్థి బోండా ఉమను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఇదే విషయమై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మెసేజ్ రూపంలో ఆయన దృష్టికి తీసుకెళ్లామని, సీఈవో నుంచి ఇంకా స్పందన రాలేదని వివరించారు. దీంతో పాటు ఏపీ డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు.

విజయవాడలో సీఎంపై దాడి పూర్తిగా స్క్రిప్టెడ్ డ్రామా అంటూ వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. విజయవాడ కమిషనర్ పై తమకు నమ్మకంలేదని, అధికార పార్టీకి అనుగుణంగా ఆయన నడుచుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలిపోవడంతో జగన్ ఈ గులకరాయి డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. బోండా ఉమ గెలుపు ఖాయం కావడంతో ఎలాగైనా ఆయనను ఇబ్బంది పెట్టాలని, రాజకీయంగా అన్ పాప్యులర్ చేయాలని వైసీపీ ఆడుతున్న నాటకమని విమర్శించారు. ఈ విషయంపై అవసరమైతే బుధవారం సాయంత్రం ఏపీ సీఈవో మీనాను కలుస్తామని వర్ల రామయ్య చెప్పారు.

More Telugu News