tesla: 14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!

  • కంపెనీలో 10 శాతానికిపైగా వర్క్ ఫోర్స్ పై వేటుకు నిర్ణయం
  • వర్క్ డూప్లికేషన్ జరగడమే కారణం
  • ఖర్చులు తగ్గించుకోవడం, ఉత్పాదకత పెంచుకోవడంపై మస్క్ సమీక్ష
Tesla To Fire 10 percent Workforce

ఎలాన్ మస్క్ కు చెందిన విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వనుంది. ఒకే రకమైన పని విభజన ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతానికిపైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. ఈ నిర్ణయం కనుక అమలైతే కంపెనీవ్యాప్తంగా 14,000 మందికిపైగా ఉద్యోగాలు కోల్పోవచ్చు.

వృద్ధి బాట కోసం..
కంపెనీ భారీగా వృద్ధి చెందడం ఉద్యోగాల డూప్లికేషన్ కు దారితీసిందని సంస్థ అంతర్గత ఈమెయిల్ లో మస్క్ అభిప్రాయపడ్డారు. “తదుపరి దశ అభివృద్ధికి కంపెనీని సిద్ధం చేసేందుకు అన్ని రకాలుగా ఖర్చులు తగ్గించుకొని ఉత్పాదకతను పెంచుకోవడం అత్యంత అవసరం. ఈ కసరత్తులో భాగంగా సంస్థ పనితీరును సమీక్షించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఉద్యోగుల సంఖ్యను 10 శాతానికిపైగా తగ్గించాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నా. ఉద్యోగులను తొలగించడంకన్నా నేను ద్వేషించే విషయం మరొకటి ఉండదు. కానీ దీన్ని అమలు చేయాల్సిందే” అని ఈమెయిల్ లో మస్క్ పేర్కొన్నారు. ఈ మేరకు ఈమెయిల్ లోని వివరాలను ఎలక్ట్రిక్.కామ్ ఉటంకించింది.

సేల్స్ తగ్గడంతో..
తమ కార్లకు డిమాండ్‌ పెంచడానికి టెస్లా ఇటీవల వరుసగా ఈవీల ధరలను తగ్గిస్తూ వచ్చింది. అయినప్పటికీ కార్ల విక్రయాలు తగ్గడంతో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకుంది. మరోవైపు మస్క్ ఈ నెలలో భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ సందర్భంగా భారత్ లో కొత్త టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటును ఆయన ప్రకటించే అవకాశం ఉంది. “ప్రధాని నరేంద్ర మోదీని ఇండియాలో కలిసేందుకు ఎదురు చూస్తున్నా” అని మస్క్ తన ‘ఎక్స్’ ప్రొఫైల్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ సమావేశానికి తేదీ ఏదీ ఖరారు కాలేదు. ప్రపంచ దేశాల నుంచి భారత్ లోకి పెట్టుబడులను స్వాగతిస్తానని మోదీ ఇప్పటికే ప్రకటించారు. భారత్ లో విద్యుత్ వాహనాలను అందించడాన్ని టెస్లా సహజ పురోగతిగా మస్క్ ఇటీవల అభివర్ణించారు.

భారత్ కొత్త ఈవీ పాలసీ నేపథ్యంలో..
భారత్ తాజాగా నూతన విద్యుత్ వాహన పాలసీ ప్రకటించిన దాదాపు నెల రోజులకు ఇండియాలో మస్క్ పర్యటన కొనసాగనుంది. ఈవీల దిగుమతులపై దాదాపు 85 శాతం మేర పన్నులు తగ్గించాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ పన్ను మినహాయింపులు పొందాలంటే ఈవీ తయారీదారులు భారత్ లో కనీసం రూ. 4,150 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే తయారీ కేంద్రాల ఏర్పాటుకు మూడేళ్ల సమయం ఇవ్వనుంది.

More Telugu News