మనసు తెలుసుకునే స్వామి

సకల దైవాలు ... సమస్త శక్తులు శ్రీ అక్కల్ కోట మహారాజ్ లోనే ఉన్నాయనే విషయాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మాట ఆనోటా ఈనోట అనేక ప్రాంతాలకు పాకిపోయింది. ఫలితంగా ఎక్కెడెక్కడి నుంచో ఆయన దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోసాగింది. తనని విశ్వసిస్తున్న వారెవరో ... ఏ ఉద్దేశంతో తన దగ్గరికి వారు వస్తున్నారనే విషయం ఆయనకి ముందుగానే తెలిసిపోతూ వుండేది.

స్వామిని ఆరాధించే భక్తులలో అక్కల్ కోట రాజు మాలోజీరావ్ కూడా ఉండేవాడు. ఒక రాజుగా కంటే ఓ సాధారణ వ్యక్తిగానే స్వామి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చని భావించిన మాలోజీ, చాలా నిరాడంబరంగా ఆయన దర్శనం చేసుకునేవాడు. సంతానంలేని కారణంగా రాజు మానసికంగా బాధపడసాగాడు. ఈ విషయాన్ని గురించి అడిగితే స్వామి ఆగ్రహిస్తాడేమోనని ఆయన సాహసించేవాడు కాదు.

ఒకరోజున స్వామి చిరునవ్వు నవ్వుతూ చేసిన సైగ కారణంగా, ఆయన తనకి సంతానాన్ని అనుగ్రహించాడని రాజుకి అర్థమైపోయింది. దాంతో ఆయన సంతోషంతో పొంగిపోతూ నిత్యం స్వామిని సేవించుకునే వాడు. అయితే పుట్టబోయేది అమ్మాయో ... అబ్బాయో తెలియక ఆయన సతమతమైపోసాగాడు. ఈ విషయాన్ని కూడా ఆయన స్వామిని అడగడానికి ధైర్యం చేయలేకపోయాడు.

ఇక అడిగితీరవలసిందేనని ఆయన నిర్ణయించుకున్న రోజున, స్వామి ఆయనకి గాజులు చూపించాడు. దాంతో తనకి పుట్టబోయేది ఆడపిల్ల అనే విషయాన్ని రాజు గ్రహించాడు. తనకి వారసుడు కావాలనుకున్న ఆయనకి ఆ విషయం పెద్దగా సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తూ ఆయన దిగాలుగా తన కార్యక్రమాలు చక్కబెట్టడం స్వామి గ్రహించాడు. ఒకరోజున రాజు వచ్చి స్వామి ఆశీస్సులు తీసుకోగానే, రానున్నది యువరాజేననీ, చింతించవలసిన అవసరం లేదని చెప్పాడు.

అంతే రాజు సంతోషానికి హద్దులు లేవు. ఆయన వెంటనే వెళ్లి ఈ విషయాన్ని తన భార్యకి తెలియజేశాడు. స్వామి చెప్పినట్టుగానే ఆ రాజదంపతులకు మగపిల్లవాడు జన్మించాడు. శ్రీ అక్కల్ కోట మహారాజ్ జీవితంలో ఇలాంటి మహిమలు ఎన్నో కనిపిస్తూ వుంటాయి ... ఆయన మహాత్మ్యాన్ని లోకానికి చాటుతూనే వుంటాయి.


More Bhakti News