పసుపు గణపతి
వినాయక చవితి పండుగ రోజున గణపతి ప్రతిమను ... పత్రిని తీసుకువచ్చి ఎవరి స్తోమతను బట్టి వారు వ్రతం చేసుకుంటూ వుంటారు. వినాయక ప్రతిమ కాకుండా పసుపు గణపతిని కూడా తయారుచేసి పూజ ప్రారంభిస్తారు. పసుపును ముద్దగాచేసి కుంకుమ బొట్టు పెట్టి, అందులోకి వినాయకుడిని ఆవాహన చేసి అప్పుడు పూజను ఆరంభిస్తారు.
ఒక్క వినాయక చవితిన మాత్రమే కాదు, విశేషమైన ప్రతి పూజలోను పసుపు గణపతిని సిద్ధం చేసి పూజించడం అనాదిగా వస్తోంది. ముందుగా ఈ పసుపు గణపతిని పూజించిన తరువాతనే, అసలు పూజ మొదలవుతుంది. అయితే ఇలా ఆరాధించిన తరువాత, ఆ పసుపు గణపతిని ఏం చేయాలనేది తెలియక చాలామంది సందిగ్ధంలో పడుతుంటారు.
పూజ అనంతరం ఆ పసుపు గణపతిని ఏం చేయడం వలన ఎలాంటి దోషం వస్తుందోనని ఆందోళన చెందుతూ వుంటారు. ఈ విషయంలో ఎవరికి తోచిన సలహా వాళ్లు ఇస్తూ ఉండటంతో, అవతలి వాళ్లు తికమకపడిపోతుంటారు. అయితే శాస్త్రం మాత్రం పసుపు రూపంలో గల గణపతిని దేనికీ ఉపయోగించరాదని చెబుతోంది.
అపవిత్రమైన ప్రదేశాల్లో పసుపు గణపతిని ఉంచరాదని చెబుతోంది. పూజ పూర్తయిన తరువాత ఈ పసుపు గణపతిని తులసి కోటలోగానీ ... మొక్కల చెంతగాని ఉంచాలని అంటోంది. అందుకు అవకాశంలేని పక్షంలో ప్రవాహంతో కూడిన జలాశయాల్లో దానిని నిమజ్జనం చేయవచ్చునని స్పష్టం చేస్తోంది.