తలుపులమ్మ క్షేత్రం

జగజ్జనని అయిన అమ్మవారు తన భక్తులను ఆదుకోవడానికి ... అనుగ్రహించడానికి అనేక ప్రదేశాల్లో ... వివిధ రూపాలలో ఆవిర్భవించింది. అలా అమ్మవారు 'తలుపులమ్మ' గా ఆవిర్భవించిన క్షేత్రమే 'లోవ'. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో అలరారుతోంది.

ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదానిని 'ధారకొండ' గా ... మరొక దానిని 'తీగకొండ' గా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య 'తలుపులమ్మ' అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది.

ఇక అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించడానికి వెనుక పురాణపరమైన కథ ఒకటి వుంది. కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి, సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్ధించగా, కొండపైన పాతాళ గంగ పొంగింది. సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు, ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో, ఆయన అభ్యర్ధనమేరకు అమ్మవారు ఇక్కడి కొండగుహలో కొలువుదీరింది.

కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో ... ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News