గర్భవతులు పూజలు చేయకూడదా ?

సహజంగానే స్త్రీలకు భక్తి భావం ఎక్కువగా వుంటుంది. పూజ కోసం పూలు కోయడం ... వాటిని మాలగాకట్టి దైవానికి సమర్పించడంలో వాళ్లు ఎంతో సంతోషాన్ని ... సంతృప్తిని పొందుతుంటారు. పూజలు ... అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి దేవాలయాలకు వెళుతూ వుంటారు. శ్రావణ ... కార్తీక మాసాల్లో వాళ్లు మరింత తీరికలేకుండా వుంటారు.

అలాంటి యువతులు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు చేయవచ్చా? ... లేదా ? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వడంతో వాళ్లు మరింత తికమకపడుతుంటారు. ఈ సందేహానికి సమాధానం శాస్త్రంలో కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించాలనీ, కొబ్బరికాయను మాత్రం కొట్ట కూడదని చెబుతోంది. కొత్త పూజా విధానాలను ఆరంభించడం గానీ, పుణ్యక్షేత్రాల దర్శనం చేయకూడదని అంటోంది.

కోటిసార్లు పూజచేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం ... కోటి స్తోత్రాలు చదవడంకన్నా ఒకసారి జపం చేయడం ... కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అందువలన గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తోంది. గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు.

పూజల పేరుతో వాళ్లు ఎక్కువ సేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఈ నియమం చేసినట్టు తెలుస్తోంది. ఇక పుణ్య క్షేత్రాలు చాలా వరకూ కొండలపై వుంటాయి ... అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన ఇబ్బందులుపడే అవకాశం ఎక్కువగా ఉన్నందు వల్లనే ఈ నియమాన్ని విధించినట్టు స్పష్టమవుతోంది. ధ్యానం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది ... అది శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది కనుక ధ్యానం చేయడమే మంచిదని పండితులు కూడా చెబుతుంటారు.


More Bhakti News