అదే ఈ క్షేత్రం ప్రత్యేకత

శ్రీమహా విష్ణువు అనేక నామాలతో పిలవబడుతూ .. అమ్మవారితో కలిసి అనేక ప్రదేశాల్లో పూజించబడుతున్నాడు. అలా ఆ స్వామి కొలువైన ప్రతి క్షేత్రం ఓ ప్రత్యేకతను .. ఓ విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. అలాంటి మహిమాన్వితమైన ప్రాచీన క్షేత్రాల్లో 'తిరు వాట్టూరు' ఒకటిగా చెప్పబడుతోంది. త్రివేండ్రం - తొడునెట్టు సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.ఈ క్షేత్రానికి రెండు వైపులా నదులు ప్రవహిస్తూ ఉండటంతో ఈ పేరు వచ్చిందని చెబుతారు. స్వామివారు ఆదికేశవ పెరుమాళ్ పేరుతోను .. అమ్మవారు మరకతవల్లి పేరుతోను పూజలు అందుకుంటూ వుంటారు.

 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఇది ఒకటిగా వెలుగొందుతోంది. తిరువనంతపురం .. అనంతపద్మనాభ స్వామి మాదిరిగానే ఇక్కడ స్వామివారు ఆదిశేషుని పై పవళించి దర్శనమిస్తుంటాడు. అక్కడ మాదిరిగానే ఇక్కడ కూడా స్వామివారిని మూడు ద్వారాల నుంచి దర్శనం చేసుకోవాలి. సాయంత్రం వేళ స్వామివారి ముఖమును సూర్యకిరణాలు తాకడం విశేషం. ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించడం వలన సమస్త పాపాలు నశించి, సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం.           


More Bhakti News