అదే పాండురంగడి మహిమ!

భక్తులను పరీక్షించడంలోను .. వాళ్లని అనుగ్రహించడంలోను మహిమలను చూపిన స్వామిగా పాండురంగడు కనిపిస్తాడు. ఎంతోమంది భక్తులు ఆయనని సేవించి తరించారు. తనని నమ్ముకున్న వారికోసం ఆ స్వామి తరలి వచ్చిన సందర్భాలు కూడా ఎన్నో కనిపిస్తాయి. అలా తన భక్తుడి కోసం ఆయన వెలసిన క్షేత్రంగా కృష్ణా జిల్లాలోని 'చిలకపూడి' కనిపిస్తుంది.

సాధారణంగా ఎక్కడైనా స్వామి వారు వెలసిన తరువాత ఆలయం నిర్మించడం జరుగుతూ వుంటుంది. కానీ చిలకపూడి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు ఒక మహా భక్తుడికి కలలో కనిపించి, ఆలయం నిర్మిస్తే ఆవిర్భవిస్తానని చెప్పాడట. ఆ భక్తుడు ఆయన ఆదేశం మేరకు ఆ గ్రామస్తుల సహకారంతో ఒక ఆలయాన్ని నిర్మించాడు.

ఆ భక్తుడికి చెప్పిన సమయానికి, గర్భాలయంలో స్వామివారు పెద్ద శబ్దం చేస్తూ వెలిశాడట. అలా స్వామివారు ఆలయ నిర్మాణం తరువాత స్వయంభువుగా ఇక్కడ వెలిశాడని అంటారు. స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని భావిస్తూ, అంకిత భావంతో ఆయనని సేవిస్తుంటారు. 'పండరీపురం'లోని పాండురంగస్వామి తరువాత ఆ స్థాయి మహిమలను చూపు దేవుడుగా భక్తులు కొలుస్తూ తరిస్తుంటారు.


More Bhakti News