మూగనోము
సాధారణంగా గలగలా మాట్లాడేవాళ్లు హఠాత్తుగా మూతి బిగించుకు కూర్చుంటే, మౌన వ్రతమా అంటూ పరిహసించడమో ... మూగనోము పట్టావా అంటూ ఆటపట్టించడమో చేస్తుంటారు. మూగనోము అనేది జనంలోకి అంతగా వెళ్లిందనడానికి ఇదో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కథ లేకుండా జరుపుకునే నోములలో ఒకటిగా మూగనోము కనిపిస్తూ వుంటుంది.
మనస్పర్థల కారణంగా బంధు మిత్రులు విడిపోయినప్పుడు ... గొడవలుపడి దూరమై పోయినప్పుడు దగ్గర కావాలనుకున్న వారు మూగనోము పడుతూ వుంటారు. ఈ నోము పట్టినవాళ్లు ఫలితం కనిపించేంత వరకూ మూగవారిలానే ఎవరితో ఏమీ మాట్లాడకూడదు.
వీళ్లు ప్రతి ఉదయం ... సాయంత్రం స్నానం చేసి తులసికోట దగ్గర దీపారాధన చేయాలి. తులసి మొక్కకి అనుకున్నన్ని ప్రదక్షిణాలు చేయాలి. ఇతరులపై కోపతాపాలు ప్రదర్శించడం వంటివి చేయకూడదు. ఇక ఫలితం కనిపించాక గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టాలి. ఎవరు తిరిగి దగ్గర కావడం వలన నోము పూర్తి అయిందో వారు ముందుగా నోము పట్టిన వారిని పలకరించాలి. ఆ నోము ఎన్ని రోజులైతే పట్టారో అన్ని దీపాలు తులసికోట దగ్గర వెలిగించి ఉద్యాపన చేసుకోవలసి వుంటుంది.