ఛత్రవట నరసింహస్వామి ప్రత్యేకత

శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాలలో 'నరసింహ అవతారం' ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. నరసింహస్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలలో 'అహోబిలం' ఒకటి. ఇది నవ నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

అహోబిల నారసింహుడు .. వరాహ నార సింహుడు .. భార్గవ నారసింహుడు .. జ్వాలా నారసింహుడు .. మాలోల నారసింహుడు .. కారంజ నారసింహుడు .. పావన నారసింహుడు .. యోగానంద నారసింహుడు .. ఛత్రవట నారసింహుడు ఇక్కడ కొలువుదీరి దర్శనమిస్తుంటారు.

ఈ క్షేత్ర దర్శనమే జన్మను తరింపజేస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ తొమ్మిది నరసింహస్వామి రూపాలలో ఒక్కో స్వామివారిని దర్శించుకోవడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుంది. 'ఛత్రవట నరసింహస్వామి' ఆలయం దగ్గరికి రాగానే ఆ స్వామికి ఆ పేరు ఎందుకు వచ్చిందనే ఆలోచన కలుగుతుంది.

పూర్వం స్వామివారి ఆలయానికి గొడుగు పట్టినట్టిగా ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేదట. వటవృక్షం ఛత్రమై నిలిచింది కనుక ఛత్రవట నరసింహ స్వామి అనే పేరు వచ్చింది. అలాంటి ఈ స్వామిని దర్శించుకోవడం వలన, తెలిసీ తెలియక శాపాలకి గురై .. వాటి ఫలితంగా అనుభవిస్తోన్న బాధల నుంచి విముక్తి కలుగుతుందని అంటారు. అందుకు నిదర్శనంగా అనేక ఆసక్తికరమైన కథనాలు ఇక్కడ వినిపిస్తూ వుంటాయి. ఆ స్వామి లీలావిశేషాల పట్ల మరింత అనురక్తిని కలిగిస్తూ వుంటాయి.


More Bhakti News