కార్తీక సోమవారాన శివకేశవ దర్శనం

కార్తీకమాసంలో సోమవారానికి గల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ రోజున సాయంత్రం వేళలో చేసే శివాభిషేకం అనంతమైన పుణ్యఫలాలను ఇస్తుంది. విష్ణుమూర్తిని ఆరాధించినా అదే ఫలితం కలుగుతుంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో నదీస్నానం చేసి శివుడిని అభిషేకించి ... బిల్వదళాలతో అర్చన చేస్తుంటారు.అలాగే వైష్ణవ ఆలయాల్లో తులసి దళాలతో సేవిస్తుంటారు.

ఈ కారణంగానే శివకేశవులు కొలువైన క్షేత్రాలకు మరింత ప్రాముఖ్యతను ఇస్తుంటారు. దాంతో ఈ రోజున ఈ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. దూరాభారం వలన ... ప్రసిద్ధి చెందిన క్షేత్రాలకు వెళ్లలేక పోయినప్పుడు, దగ్గరలోని హరిహరుల క్షేత్రాలను దర్శించడం వలన కూడా అదే ఫలితం లభిస్తుంది. అయితే ప్రచారానికి దూరంగా మారుమూల గ్రామాల్లో గల కొన్ని విశిష్ట క్షేత్రాలను గురించి తెలిస్తే అక్కడికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

అలా పెద్దగా ప్రాచుర్యానికి నోచుకోని శివకేశవుల ఆలయం మనకి 'కల్మల్ చెరువు' లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలంలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కాకతీయుల కాలంనాటి శివాలయాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. హరిహరులు కొలువైన ఈ క్షేత్రం మాత్రం కాకతీయుల కాలం కంటే పురాతనమైనదని చెబుతుంటారు.

ఒకే ప్రాంగణంలో ... ప్రత్యేక గర్భాలయాల్లో వేంకటేశ్వరస్వామి ... శివుడు కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టగానే ఒకనాడు ఇది వైభవంతో వెలుగొందినదనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. అలాగే ప్రాచీనమైన క్షేత్రంగానే కాదు ... మహిమాన్వితమైన క్షేత్రంగా కూడా అనిపిస్తూ ఉంటుంది.

తగినంత ప్రాచుర్యం లేకపోవడంవల్లనే ఇక్కడ భక్తుల సందడి తక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా శివకేశవులను దర్శించి ... మనసారా వాళ్లకు పూజాభిషేకాలు జరిపించి వనభోజనాలు చేసి వెళ్లాలనుకునే వారు ఈ క్షేత్రాన్ని దర్శించవచ్చు. ఇలాంటి ఆలయాలను గురించి ఒకరి ద్వారా మరొకరికి తెలుస్తూ ఆలయాలకి పూర్వవైభవం వస్తే భక్తులకు అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు.


More Bhakti News