అమ్మవారి ఆరాధనతో తొలగే దోషం !

రాహు గ్రహ సంబంధమైన దోషాలు కూడా జీవితంలో అనేక ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. వ్యాపారపరమైన నష్టాలు కలగడం ... అభివృద్ధికి అడ్డుకట్టవేస్తూ అవమానాలు ఎదురుకావడం రాహు దోష ప్రభావం వల్లనే జరుగుతూ వుంటుంది. హఠాత్తుగా ప్రమాదాల బారిన పడటం, ఆ కష్టం నుంచి కోలుకునే పరిస్థితి లేకపోవడానికి కారణం ఈ దోషమే.

ఇలాంటి బాధలు వెంటాడుతూ ఉండటాన్ని రాహు గ్రహ సంబంధమైన దోషంగా గుర్తించవలసి వుంటుంది. ఈ బాధలను తట్టుకోలేమని భావించినవాళ్లు, సాధ్యమైనంత త్వరగా అందులో నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఇందులో భాగంగానే ఆయా క్షేత్రాలను దర్శించుకోవడం, రాహువును శాంతింపజేయడానికి తగిన కార్యక్రమాలు జరిపించడం వంటివి చేస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే రాహు గ్రహ సంబంధమైన దోషంతో బాధలుపడుతోన్నవాళ్లు, 'కనకదుర్గాదేవి'ని పూజించాలని శాస్త్రం చెబుతోంది. ప్రతి శుక్రవారం కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి, అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేయాలి. అంకితభావంతో ఆ తల్లికి పూజలు చేయించాలి. ఈ విధంగా అమ్మవారిని ఆరాధిస్తూ వుండటం వలన రాహు దోషం తొలగిపోయి, ఆశించినస్థాయిలో మంచిఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.


More Bhakti News