ఈ బల్లులను తాకితే దోషనివరణ

సాధారణంగా ప్రతి ఇంట్లోను బల్లులు తిరుగుతూనే వుంటాయి. అవి ఇంట్లోకి వచ్చే చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటూ వుంటాయి. అందువలన ఎవరూ కూడా తమ ఇంట్లోని బల్లులను చంపడం వంటి పనులు చేయరు. అవి ఆహార పదార్థాలలో పడకుండా జాగ్రత్త పడుతూ వుంటారంతే.

ఇక బల్లి అనేది మీదపడితే దోషమనే విశ్వాసం ప్రాచీనకాలం నుంచి వుంది. శరీరంలో గల వివిధ భాగాలపై బల్లి పడటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని అందుకు సంబంధించిన శాస్త్రం చెబుతూ వుంటుంది. అందువలన మీద బల్లి పడగానే దాని ఫలితం ఎలా వుంటుందో తెలుసుకోవడానికి అంతా ప్రయత్నిస్తుంటారు.

మీద బల్లి పడినప్పుడు 'కంచి'లో బల్లిని తలచుకుని స్నానం చేసి ... ఇష్టదేవతారాధన చేయడం వలన ఆ దోషం పోతుందని చెప్పబడుతోంది. కంచి ఆలయంలో బంగారు బల్లి ... వెండి బల్లి రూపాలు దర్శనమిస్తూ వుంటాయి. వాటిని తాకడం వలన అప్పుడప్పుడు బల్లిపడటం వలన కలిగిన దోషాలు తొలగిపోతాయని అంటారు. ఇలాంటి పద్ధతి మనకి 'దేవుని కడప'లోను కనిపిస్తుంది.

పౌరాణిక ... చారిత్రక నేపథ్యాలను కలిగిన 'లక్ష్మీ వేంకటేశ్వరస్వామి' క్షేత్రం ఇక్కడ దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి అమ్మవారి మందిరం 'పై కప్పు' కి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ... ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకూ బల్లులు మీద పడటం వలన దోషాలు ఏమైనా కలిగి వుంటే అవి తప్పకుండా నివారించబడుతాయని స్థలపురాణం చెబుతోంది.


More Bhakti News