ఛాయా విశేషం

పుణ్య క్షేత్రాలలో ... పురాణ గాధలలో చోటుచేసుకున్న క్షేత్రాలలో మానవుడి మేధస్సుకు అందని అద్భుతాలు కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తూ వుంటాయి. సహజంగానే నమ్మకానికి అందని సంఘటనలను ... దృశ్యాలను మహిమాన్వితమైనవిగా భావిస్తూ వుంటాం. అలాంటి దృశ్యమే మనకి 'ఛాయ సోమేశ్వర ఆలయం'లో కనిపిస్తుంటుంది.

నల్గొండలో ఛాయ సోమేశ్వరస్వామి క్షేత్రం విరాజిల్లుతోంది. ఒకప్పుడు పానగల్లు పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రాంతమిది. ప్రాచీన కాలంనాటి ఇక్కడి దేవాలయం ... ఆనాటి కట్టడాలు ... శిల్ప కళా నైపుణ్యం మనసుకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి.

ఇక ఛాయ సోమేశ్వర స్వామి దేవాలయంలోని శివలింగం మొదటి చూపులోనే మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఉదయం ... మధ్యాహ్నం ... సాయంత్రం ... రాత్రి అనే తేడా లేకుండా ఈ శివలింగం వెనుక భాగంలోని గోడపై స్తంభం ఆకారంలో ఒక నీడ పడుతుంటుంది. ఈ నీడ దేనికి సంబంధించినదీ కాకపోవడం ... సూర్యోదయ సూర్యాస్తమయాలతో సంబంధం లేకుండా ఒకేచోట ఈ నీడ నిలకడగా వుండటం అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తుంది.

శివలింగం వెనుక భాగంలో నిశ్చలంగా నిలిచి ఉంటున్న ఈ నీడను గురించి దశాబ్దాలుగా పరిశోధనలు చేసినా ప్రయోజనం లేకపోయింది. గర్భగుడిలో ఛాయతో పాటు కొలువు దీరిన సోమేశ్వరుడు కనుక ఈ స్వామి ఛాయ సోమేశ్వరుడిగా ప్రసిద్ధిచెందాడు. ఇక ఇక్కడి ఛాయా విశేషాన్ని చూడటానికి ... సోమేశ్వరుడిని దర్శించి ధన్యులు కావడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ వుంటారు.


More Bhakti News