నెమలి వేణుగోపాల స్వామి

శ్రీ కృష్ణుడికి ... నెమలికి విడదీయరాని సంబంధముంది. నెమలి పింఛం ధరించడమంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. చేతిలో వెన్న ముద్దలేని బాల కృష్ణుడు కనిపిస్తాడేమో గానీ, తలపై నెమలి పింఛంలేని కృష్ణుడు మాత్రం కనిపించడు. ఈ సృష్టిలో సంయోగం చేత సంతానాన్ని పొందని పక్షి నెమలి మాత్రమే. ఈ పవిత్రతే శ్రీ కృష్ణుడు నెమలి పింఛం ధరించడానికి కారణమైందని చెబుతుంటారు. అలాంటిది నెమలి అనే ఊళ్లో శ్రీ కృష్ణుడు ఆవిర్భవించడమనేది సహజంగానే విశిష్టతను సంతరించుకున్నదిగా అనిపిస్తుంది.

'శ్రీ వేణుగోపాల స్వామి' కొలువుదీరిన ఈ పుణ్య క్షేత్రం ... కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలో వుంది. ఇక్కడి వేణుగోపాలుడు మహా మహిమ కలిగినవాడుగా ప్రసిద్ధిచెందిన కారణంగా, విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. మానసిక ప్రశాంతత లేనివారు ... అంతుచిక్కని వ్యాధుల బారిన పడినవారు ... సంతానలేమితో బాధపడేవారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో గణాచారి వ్యవస్థ కనిపిస్తుంది. అనారోగ్య పరమైన తమ సమస్యలకి గల కారణాలను ... పరిష్కార మార్గాలను గురించి భక్తులు వారి ద్వారా తెలుసుకుని, స్వామివారి దర్శనం చేసుకుని వెళుతూ వుంటారు.

ఇక ఇక్కడ వేణుగోపాలుడు అవతరించిన తీరును తెలిపే స్థానిక కథనం ఒకటి మనకి వినిపిస్తూ వుంటుంది. 1953 ప్రాంతంలో నెమలి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ... అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి తన భూమిని అమ్మేశాడు. ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి సాగుచేయిస్తుండగా, శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహం బయటపడింది. అయితే స్వామివారి చిటికిన వ్రేలు దెబ్బతినడంతో దానిని సరిచేసి ప్రతిష్ఠకి ఎలాంటి లోపాలు లేకుండా చూసుకున్నారు. మొదట స్వామివారిని ఓ తాటాకు పందిరిలో వుంచి పూజలు నిర్వహిస్తూ వుండేవారు. ఆ తరువాత గ్రామస్తులంతా కలిసి విరాళాలు వేసుకుని దేవాలయాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రాజగోపురం ... కళ్యాణ మంటపం ... అద్దాల మంటపం ... అన్నదాన సత్రం ... రథశాల ... కల్యాణకట్ట మొదలైనవి రూపుదిద్దుకున్నాయి. ఆలయ అభివృద్ధితో పాటు స్వామివారి మహిమలు కూడా వెలుగు చూశాయి.

సోమవారం ... శుక్రవారాల్లో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి యేట 'ఫాల్గుణ మాసం'లో ఆరు రోజుల పాటు రుక్మిణీ - సత్యభామ సమేతుడైన స్వామికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వైభవాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు ... తమకి తోచిన రీతిలో స్వామివారికి కానుకలు ... ముడుపులు సమర్పించుకుంటూ వుంటారు.


More Bhakti News