మత్స్య జయంతి రోజున ఏం చేయాలి ?

వేదాలు ... సకల లోకాలలోని చీకట్లను పారద్రోలే ఆయుధాలు. సమస్త దేవతలకు ... మహర్షులకు ... మానవాళికి వెలుగును ప్రసాదించే ఆధారాలు. అలాంటి వేదాలు బ్రహ్మదేవుడి అధీనంలో ఉంటాయి. అంతటి విశిష్టమైన వేదాలను అపహరించి అన్ని లోకాలను అజ్ఞానాంధకారంలోకి నెట్టేయాలని హయగ్రీవుడనే రాక్షసుడు భావిస్తాడు. బ్రహ్మదేవుడి అధీనంలో గల వేదాలను అపహరించి, తన ఉనికి ఎవరికీ తెలియకుండా సముద్ర గర్భంలో దాక్కుంటాడు.

విషయాన్ని విష్ణుమూర్తికి వివరిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తాడు బ్రహ్మదేవుడు. ప్రళయకాలం ఆసన్నమైందనే విషయాన్నీ కూడా అదే సమయంలో శ్రీమహావిష్ణువుకి గుర్తుచేస్తాడు. సముద్ర గర్భంలోగల వేదాలను రక్షించడానికీ ... మరో యుగానికి అవసరమైన జీవరాశిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరిస్తాడు. సముద్ర గర్భంలోకి ప్రవేశించి అసుర సంహారం చేసి వేదాలను కాపాడతాడు.

అదే మత్స్యావతారంతో సత్యవ్రతుడనే భక్తుడిని రక్షించి, ఆయన ద్వార తరువాత యుగానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాడు. ఈ కారణంగానే మత్స్యావతారం మహా విశిష్టమైనదిగా చెబుతుంటారు. లోకకల్యాణం కోసం స్వామి చైత్ర శుద్ధ తదియ రోజున మత్స్యావతారం ధరించాడు కనుక, ఈ రోజుని 'మత్స్య జయంతి' గా జరుపుకోవడం అనాదికాలం నుంచి వస్తోంది.

ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజా మందిరాన్ని పూలమాలికలతో అలంకరించి, విష్ణుమూర్తికి షోడశోపచార పూజను నిర్వహించాలి. స్వామివారికి ఇష్టమైన ఫలాలను ... పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజంతా కూడా స్వామివారి నామస్మరణ ... భజనలు ... పారాయణాలు చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ రోజున విశిష్టమైన వైష్ణవ క్షేత్రాలను దర్శించడం వలన , అక్కడ శక్తిమేర దానధర్మాలు చేయడం వలన మోక్షం లభిస్తుందని చెప్పబడుతోంది.


More Bhakti News