చైత్రమాసంలో చోటుచేసుకునే విశేషాలు

తెలుగు మాసాలలో చైత్రమాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రకృతి కొత్త దనాన్ని సంతరించుకుని, ఆ సంతోషాన్ని మానవాళితో పంచుకునే రోజు చైత్రంతోనే మొదలవుతుంది. చైత్రమాసపు తొలిరోజునే 'ఉగాది' పండుగగా జరుపుకోవడం తరతరాల నుంచి వస్తోంది. బ్రహ్మదేవుడు సృష్టి రచనను ఈ రోజునే ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ప్రతిఒక్కరూ బ్రహ్మదేవుడిని అంకితభావంతో ఆరాధించి కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఇక చాంద్రమానం ప్రకారం నూతన సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి, చంద్రుడిపట్ల కృతజ్ఞతా పూర్వకంగా చైత్ర శుద్ధ విదియ రోజున బాలచంద్రుడిని పూజిస్తుంటారు. దీనినే 'బాలేందు వ్రతం' అని పిలుస్తుంటారు. ఇక శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో 'మత్స్యావతారం' మొదటిది. చైత్ర శుద్ధ తదియ రోజున ఆయన ఈ అవతారాన్ని ధరించి లోకాలకు వెలుగును చూపే వేదాలను రక్షించాడు. అందువలన ఈ రోజున 'మత్స్య జయంతి' ని జరుపుకుంటూ ఉంటారు.

ఇక ఇదే రోజున 'సంపద గౌరీ వ్రతం' జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది. అలాగే చైత్ర శుద్ధ చవితి రోజున వినాయకుడినీ ... పంచమి రోజున లక్ష్మీదేవిని ... అష్టమి రోజున శివుడిని ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది. ఇక శ్రీరామచంద్రుడి జీవితంలో 'నవమి రోజు' ప్రత్యేక పాత్రను పోషిస్తూ వచ్చింది. శ్రీరాముడు జన్మించినదీ ... వివాహం చేసుకున్నదీ ... వనవాసం నుంచి తిరిగి వచ్చినది నవమి రోజునే.

ఈ సందర్భంగా చైత్రశుద్ధ నవమి రోజున వైష్ణవ క్షేత్రాల్లో సీతారాములకు అంగరంగవైభవంగా కళ్యాణోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇలా సృష్టి రచన మొదలు అనేక పురాణపరమైన ఘట్టాలకు ... త్రిమూర్తుల - త్రిశక్తి మాతల ఆరాధనకు చైత్రమాసం వేదికగా నిలుస్తోంది. ఈ కారణంగానే చైత్ర మాసం విశేషమైనదిగా ... విశిష్టమైనదిగా పురాణాలచే చెప్పబడుతోంది.


More Bhakti News