కార్తీక సోమవారం

నోములన్నింటిలోకి 'కార్తీక సోమవారం నోము' విశిష్టమైనదిగా చెప్పబడింది. ఈ నోము మహిమను చాటే కథ గురించి తెలుసుకుంటే, స్త్రీలంతా ఈ నోము పట్ల ఎందుకు ఇంతటి శ్రద్ధాసక్తులను చూపిస్తున్నారనేది అర్థమవుతుంది. పూర్వం 'శతకోటి' అనే ఒక బ్రాహ్మణ కన్య అందచందాలతో తనకి సాటి మరొకరు లేరనిపించుకుంది. అయితే ఆమె ఎవరింటికి వెళితే ఆ ఇంటి వాళ్లకి వెంటనే ఏదో ఒక నష్టం జరిగేది. దాంతో ఆమె ఎక్కడ వుంటే అక్కడ దరిద్రం తాండవ మాడుతుందనే ప్రచారం జోరుగా జరిగింది.

ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె అందచందాలకు ముగ్దుడైన ఓ శ్రీమంతుడు, ఎవరెన్ని చెబుతున్నా వినిపించుకోకుండా శతకోటిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ శ్రీమంతుడు చేస్తోన్న అన్ని వ్యాపారాల్లోను నష్టాలు రావడంతో, ఏడాది తిరిగేలోగా అతను దివాలా తీశాడు. ఈ విషయంగా అత్తారింటి వారు తీవ్రంగా వేధిస్తూ ఉండటంతో ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది. సరిగ్గా ఆసమయంలోనే పార్వతీ దేవి ప్రత్యక్షమై ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుంది.

శివుడు ఐశ్వర్య కారకుడనీ, ఆయన అనుగ్రహం కోసం 'కార్తీక సోమవారపు నోము' నోచుకోమని శతకోటితో పార్వతీదేవి చెప్పింది. ఈ నోము ఫలితంగా ఆమె ఎక్కడుంటే అక్కడ సిరిసంపదలు ఉంటాయని అంది. దాంతో శతకోటి మనసు మార్చుకుని ఇంటికి వచ్చి కార్తీక మాసం రాగానే సోమవారం నోము పట్టింది.

ఉదయాన్నే నదీ స్నానం చేసి ... నదిలో నుంచి తీసిన మెత్తని మట్టిలో శ్రీ గంధాన్ని - పాలని కలిపి శివలింగాన్ని తయారు చేసింది. 108 సార్లు పంచాక్షరీ మంత్రాన్ని స్మరిస్తూ ఆ శివలింగాన్ని అర్చించింది. ధూప .. దీప .. నైవేద్యాలను సమర్పించిన తరువాత, ఆ శివలింగాన్ని ఓ బ్రాహ్మణుడికి దానమిచ్చింది. దాంతో అప్పటి వరకూ ఆమెను వెంటాడిన దోషం తొలగి పోయింది.

అందానికి అదృష్టం ... ఐశ్వర్యం తోడు కావడంతో, అందరూ ఆమెను గౌరవించడం ... అభిమానించడం మొదలు పెట్టారు. నోము ఫలితంగా సంపదలన్నీ తిరిగి సమకూరడంతో అత్తగారింట్లో వారంతా కూడా ఆమెపై ప్రేమాభిమానాలు కురిపిస్తూ అపురూపంగా చూసుకోసాగారు. తన పరిస్థితికి కారకులైన ఆది దంపతులకు మనసులోనే శతకోటి కృతజ్ఞతలు తెలియజేసింది.


More Bhakti News