దేవుడి విగ్రహానికి మొలిచిన శిరోజాలు ?

శ్రీమహావిష్ణువుకి సంబంధించిన కొన్ని క్షేత్రాల్లో మూలమూర్తికి శిరోజాలు కనిపించిన విషయాన్ని విశేషంగా ప్రస్తావిస్తూ స్థలపురాణంగా వివిధ కథనాలు వినిపిస్తూ వుంటాయి. అయితే ఆయా రాజుల చరిత్రతో ఈ సంఘటనలు ముడిపడివుండటం వలన, అవి మహిమాన్వితమైన సంఘటనలుగానే చరిత్రలో మిగిలిపోయాయి. అలాంటి సంఘటన ఒకటి తమిళనాడు ప్రాంతంలోని 'తిరువన్నాపురం'లో జరిగినట్టుగా చెప్పబడుతోంది.

ఇక్కడి ఆలయంలో మనసునుదోచే రూపంలో మాధవుడు దర్శనమిస్తూ వుంటాడు. ఒకప్పుడు ఈ కృష్ణుడి విగ్రహానికి శిరోజాలు కనిపించినట్టుగా చరిత్ర చెబుతోంది. అందుకు సంబంధించిన కథలోకి వెళితే ... శ్రీకృష్ణుడికి నిత్య ధూప దీపాలు నిర్వహించే అర్చకుడు స్వామివారికి పరమభక్తుడిగా ఉండేవాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు.

అయితే కుంభకోణం నుంచి స్వామివారి కోసం రాజుగారు రోజుకొక పూలమాలను ప్రత్యేకంగా కట్టించి పంపించేవాడు. అందంగా వుండే ఆ పూలమాలికను తను ధరిస్తానంటూ చిన్న భార్య గారాలుపోవడంతో ఆ అర్చకుడు కాదనలేకపోతాడు. ఒకరోజున స్వామివారిని దర్శించుకోవడానికి రాజుగారు స్వయంగా వస్తున్నాడనే విషయం పూజారికి తెలుస్తుంది. దాంతో వెంటనే ఆయన ఇంటికి వెళ్లి ఆ రోజు ఉదయం రాజుగారు పంపించిన పూలదండను భార్య దగ్గర నుంచి తీసుకువస్తాడు.

రాజుగారు ఆలయానికి రాగానే పూజచేసి, స్వామివారి పూలదండను స్వీకరించమని అందజేస్తాడు. ఆ పూలదండకి స్త్రీ శిరోజం వుండటం చూసిన రాజుగారు దానిని గురించి ప్రశ్నిస్తాడు. కంగారుపడిపోయిన పూజారి, స్వామివారి విగ్రహానికే శిరోజాలు ఉన్నట్టుగా చెబుతాడు. మరునాడు ఉదయం ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి తాను గర్భగుడిలోకి వచ్చి చూస్తాననీ, అతను చెప్పినది అసత్యమైతే తగిన శిక్ష తప్పదని వెళ్లిపోతాడు. తనని ఈ గండం నుంచి గట్టెక్కించమంటూ ఆ పూజారి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు.

మరునాడు ఉదయం రాజుగారు వచ్చి గర్భాలయంలో గల మూలమూర్తిని పరిశీలిస్తాడు. కృష్ణుడి విగ్రహానికి సహజమైనటువంటి శిరోజాలు వుండటం చూసి ఆశ్చర్యపోతాడు. స్వామివారికి శౌరి ( తమిళంలో 'శిరోజాలు' ) రాజ పెరుమాళ్ గా నామకరణం చేస్తూ, ఆయన మహిమను జనసామాన్యంలోకి తీసుకువెళతాడు. తనని రక్షించిన దైవానికి ఆ పూజారి కృతజ్ఞతలు తెలుపుకోవడమే కాకుండా, ఆ తరువాత అలాంటి తప్పులు జరగకుండా నడచుకున్నాడు. అప్పట్లో స్వామివారికి శిరోజాలు మొలిచిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయని చెప్పుకుంటూ వుంటారు.


More Bhakti News