మోక్షదా ఏకాదశి వ్రతం

మోక్షదా ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమై పోతుంటుంది. మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు ... అవసరాలు వుంటాయి గనుక వాటిని గురించి దైవాన్ని ప్రార్ధించడం జరుగుతుంటుంది. నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్ధం మోక్షాన్ని కోరడమే అవుతుంది.

పాపాలు చేస్తున్నంత కాలం మరణించడం ... మరలా జన్మించడం, మళ్లీ మళ్లీ కష్టాలు బాధలు అనుభవిస్తూ వుండటం జరుగుతూ వుంటాయి. అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్టయితే అన్నిరకాల యాతనలకు అతీతులను చేస్తూ మోక్షం లభిస్తుంది. అయితే అంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలా మందిలో కలుగుతూ వుంటుంది. అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలా 'మోక్షదా ఏకాదశి' కనిపిస్తూ వుంటుంది.

'మార్గశిర ఏకాదశి' నే మోక్షదా ఏకాదశి గా పిలుస్తుంటారు. ఇక ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకునే వాళ్లు, ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంటినీ ... పూజా మందిరాన్ని పరిశుభ్రపరిచి విష్ణుమూర్తి పటాన్ని అలంకరించాలి. విష్ణుమూర్తి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి, షోడశోపచార పూజా విధానాన్ని పూర్తి చేయాలి.

ఆ రోజంతా ఉపవాసం ఉండి ... విష్ణునామ సంకీర్తనతో జాగరణ చేయాలి. మరునాడు ఉదయాన్నే పునఃపూజ చేసి నైవేద్యం సమర్పించడంతో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్టు అవుతుంది. పూర్వం ఈ వ్రతాన్ని వైఖాసనుడనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.


More Bhakti News