Ganapathi: గణపతి జనజీవన స్రవంతిలోకి రావాలి.. నేను కూడా ఆయనతో కలిసి పని చేస్తా: గోనె ప్రకాశ్ రావు

Gone Prakash Rao on Ganapathi Joining Mainstream
  • మావోయిస్టు నేత గణపతి లొంగిపోతున్నారంటూ వార్తలు
  • గణపతి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్న గోనె ప్రకాశ్ రావు
  • మావోల లొంగుబాట్లకే పోలీసులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన

మావోయిస్టు అగ్రనేత గణపతి (ముప్పాళ్ల లక్ష్మణరావు) లొంగిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు స్పందిస్తూ, గణపతి తక్షణమే జనజీవన స్రవంతిలోకి వచ్చి సమాజ సేవ చేయాలని పిలుపునిచ్చారు. తాను కూడా గణపతితో కలిసి పనిచేస్తానని చెప్పారు. 77 ఏళ్ల వయస్సులో ఉన్న గణపతి ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయన తుపాకీని వదిలి శాంతి మార్గంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.


గణపతి కుమారుడు ముప్పాళ్ల శ్రీనివాస్ (వాసు) పంపిన వాయిస్ మెసేజ్‌ను ఆయన అనుమతి లేకుండా మీడియాకు షేర్ చేసినందుకు గోనె ప్రకాశ్ రావు బహిరంగంగా క్షమాపణలు కోరారు. ఇది కేవలం గణపతి లొంగుబాటుపై ఉన్న ఉత్కంఠ వల్ల జరిగిన పొరపాటుగా ఆయన వివరించారు. మరోవైపు, ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు నేత దేవ్‌జీ (తిప్పరి తిరుపతి) రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారని, ఆయన కోరుట్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని గోనె వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. గతంలో సీతక్క వంటి వారు కూడా దళం నుంచి వచ్చి ప్రజా సేవ చేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.


కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న డెడ్‌లైన్ ప్రకారం మార్చి 31లోపు మావోయిజాన్ని అంతం చేయాలనే లక్ష్యం ఉన్నప్పటికీ... పోలీసులు ఎన్‌కౌంటర్ల కంటే లొంగుబాటులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి వంటి అగ్ర నేతలను సురక్షితంగా సమాజంలోకి తీసుకువచ్చినట్లే, గణపతిని కూడా గౌరవప్రదంగా జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలని ఆయన కోరారు.

Ganapathi
Muppalla Lakshmana Rao
Gone Prakash Rao
Maoist
Telangana
Andhra Pradesh
Surrender
Devji
Malla Rajireddy
Naxal

More Telugu News