Mohsin Naqvi: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పాల్గొనడంపై నీలినీడలు.. జట్టు కిట్ ఆవిష్కరణ రద్దు

T20 World Cup Pakistan Participation Uncertain After Kit Launch Cancellation
  • టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ భాగస్వామ్యంపై పెరిగిన అనుమానాలు
  • పాక్ జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అనూహ్యంగా రద్దు చేసిన పీసీబీ
  • టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తొలగించడాన్ని నిరసిస్తున్న పాకిస్థాన్
  • టోర్నీ నుంచి వైదొలగితే పాక్‌కు తప్పని భారీ ఆర్థిక నష్టాలు
  • సోమవారం తుది నిర్ణయం తీసుకోనున్న పాకిస్థాన్ ప్రభుత్వం
త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పాల్గొనడంపై నెలకొన్న అనిశ్చితి మరింత తీవ్రమైంది. శనివారం లాహోర్‌లో ఆస్ట్రేలియాతో జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్‌కు ముందు నిర్వహించ తలపెట్టిన జట్టు కిట్ (జెర్సీ) ఆవిష్కరణ కార్యక్రమాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) అనూహ్యంగా రద్దు చేసింది. ఈ మేరకు టెలికామ్ ఏషియా స్పోర్ట్ ఒక కథనంలో వెల్లడించింది. కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయని ఆ కథనం పేర్కొంది. ఈ పరిణామంతో ప్రపంచకప్‌లో పాక్ భాగస్వామ్యంపై సందేహాలు మరింత బలపడ్డాయి.

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను బహిష్కరించడాన్ని నిరసిస్తూ పాకిస్థాన్ ఈ వైఖరి తీసుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తిరస్కరించింది. భారత్‌లో భద్రతపై స్వతంత్ర సమీక్ష నిర్వహించిన ఐసీసీ, బంగ్లా బోర్డు సందేహాలు నిరాధారమైనవని తేల్చి చెప్పింది. ఐసీసీ నిర్దేశించిన గడువులోగా బంగ్లాదేశ్ తాము ఆడేదీ, లేనిదీ ధృవీకరించకపోవడంతో, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి తీసుకున్నారు. ఈ నిర్ణయమే ప్రస్తుత వివాదానికి కారణమైంది.

ఈ వివాదంపై పీసీబీ ఛైర్మన్ మోహసిన్ నఖ్వీ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ఈ విషయంపై దేశ ప్రధాని, అధ్యక్షుడితో సమావేశమై సలహాలు తీసుకున్నారు. టోర్నీ నుంచి వైదొలగవద్దని ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు బోర్డుకు సూచిస్తున్నప్పటికీ, నఖ్వీ తన ప్రణాళికలకే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే భారీ ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మరోవైపు, ఆస్ట్రేలియా జట్టుతో పాటు పాక్ జట్టు కూడా సోమవారం ఉదయం కొలంబోకు బయల్దేరాల్సి ఉన్నా, ఆ ప్రయాణం కూడా ఇంకా ఖరారు కాలేదని టెలికామ్ ఏషియా నెట్ వర్గాలు తెలిపాయి.

పాకిస్థాన్ భాగస్వామ్యంపై తుది నిర్ణయాన్ని విదేశాంగ కార్యాలయం ద్వారా సోమవారం ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతవారమే ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమైన నఖ్వీ, శుక్రవారం లేదా సోమవారం తుది నిర్ణయం వెలువడుతుందని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Mohsin Naqvi
Pakistan
T20 World Cup
PCB
ICC
Cricket
Bangladesh
Australia
Team Kit
Boycott

More Telugu News