Lakshmi Narayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసగించిన కేసులో నలుగురి అరెస్ట్

Lakshmi Narayanas Wife Loses Crores in Stock Market Fraud Four Arrested
  • మయన్మార్ ముఠాకు మ్యూల్ ఖాతాలు అందించిన నిందితులు
  • బీహార్, పశ్చిమ బెంగాల్‌లో నిందితులను పట్టుకున్న పోలీసులు
  • మోసపోయిన సొమ్ములో రూ.45 లక్షలను ఫ్రీజ్ చేసిన అధికారులు
  • రూ.2.58 కోట్లు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళను మోసగించిన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్‌ చేశారు. మోసానికి గురైన సొమ్ములో రూ.45 లక్షలను ఫ్రీజ్‌ చేసినట్లు వెల్లడించారు.

మయన్మార్‌ కేంద్రంగా పనిచేస్తున్న ముఠాకు ఈ నిందితులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ నలుగురు సైబర్‌ నేరగాళ్లకు మ్యూల్‌ బ్యాంకు ఖాతాలను సమకూర్చినట్లు నిర్ధారించారు. నిందితులను ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి, కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.

గతేడాది నవంబరులో ఊర్మిళ వాట్సప్‌కు స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించి ఓ లింక్ వచ్చింది. 500 రెట్ల లాభం వస్తుందని ఆశచూపడంతో ఆమె పలు దఫాలుగా డిసెంబర్ 24 నుంచి జనవరి 5 మధ్య రూ.2.58 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ఆమె ఖాతాలో రూ.2 కోట్ల లాభం వచ్చినట్లు నమ్మించి, ఆ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పించలేదు. పైగా మరింత డబ్బు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

దీంతో మోసపోయినట్లు గ్రహించిన ఊర్మిళ ఈ నెల మొదటి వారంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Lakshmi Narayana
VV Lakshmi Narayana
CBI JD Lakshmi Narayana
Urmila Lakshmi Narayana
Stock market fraud
Cyber crime Hyderabad
Investment fraud
Myanmar
Freezed amount
Cyber Crime Police

More Telugu News