Narendra Modi: నరసాపురం లేస్ క్రాఫ్ట్ పై ప్రధాని మోదీ ప్రశంసలు... కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు

Narendra Modi Praises Narasapuram Lace Craft Chandra Babu Thanks PM
  • మన్ కీ బాత్‌లో నరసాపురం లేస్ కళను ప్రస్తావించిన ప్రధాని మోదీ
  • ప్రధాని ప్రశంసలపై సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు
  • ఈ కళను కాపాడుతున్న మహిళల నైపుణ్యాన్ని అభినందించిన సీఎం
  • నరసాపురం లేస్‌కు జీఐ ట్యాగ్ లభించిందని గుర్తుచేసిన ప్రధాని
  • ఈ కళ ద్వారా లక్ష మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరసాపురం లేస్ క్రాఫ్ట్ (కుట్లు అల్లికల కళ)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఆదివారం ప్రసారమైన తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆయన ఈ కళ యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాని ప్రశంసలపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. "నరసాపురం లేస్ కళను ప్రశంసించినందుకు ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు. తరతరాలుగా కుటుంబాలు, సంఘాలు కాపాడుకుంటున్న అనేక సంప్రదాయ కళలకు ఆంధ్రప్రదేశ్ నిలయం. నరసాపురంలో పుట్టిన క్రోచెట్ లేస్ తయారీ అటువంటి అద్భుతమైన కళారూపం" అని పేర్కొన్నారు. 

ఈ కళను కాపాడటమే కాకుండా, ప్రపంచానికి పరిచయం చేస్తున్న మహిళల నైపుణ్యాన్ని, అంకితభావాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ కళకు, కళాకారులకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.

అంతకుముందు తన ప్రసంగంలో ప్రధాని మోదీ, సంప్రదాయ కళలు సమాజానికి సాధికారత కల్పించడంతో పాటు ఆర్థిక ప్రగతికి ముఖ్యమైన సాధనంగా నిలుస్తాయని అన్నారు. "ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం లేస్ కళ ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. తరతరాలుగా ఈ కళ మహిళల చేతుల్లోనే భద్రంగా ఉంది" అని కొనియాడారు.

ఈ కళను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాబార్డ్ కలిసి పనిచేస్తున్నాయని, కళాకారులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయని ప్రధాని వివరించారు. నరసాపురం లేస్‌కు జీఐ ట్యాగ్ కూడా లభించిందని గుర్తుచేశారు. దీని ద్వారా 500కు పైగా ఉత్పత్తులు తయారవుతున్నాయని, 250 గ్రామాల్లో దాదాపు లక్ష మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Narendra Modi
Narasapuram Lace Craft
Andhra Pradesh
Chandra Babu Naidu
Man Ki Baat
GI Tag
Crochet Lace
AP Government
NABARD

More Telugu News