Mohan Bhagwat: తిరుపతిలో ఆర్ఎస్ఎస్ చీఫ్, సీఎం చంద్రబాబు... భారతీయ విజ్ఞాన సమ్మేళన్‌కు శ్రీకారం

RSS Chief Mohan Bhagwat Visits Tirumala with Minister Jitendra Singh
  • తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళన్‌ను ప్రారంభించిన మోహన్ భగవత్, చంద్రబాబు
  • పిల్లలకు స్పైడర్‌మ్యాన్ కాదు, హనుమంతుడి గురించి చెప్పాలన్న సీఎం
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
  • సాధారణ భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన భగవత్
  • ప్రాచీన భారత విజ్ఞానాన్ని ఆధునికతతో అనుసంధానించడమే సదస్సు లక్ష్యం
ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుపతిలో ఒకే వేదికను పంచుకున్నారు. స్థానిక జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళన్ (BVS) 2025ను ఇరువురూ సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. "భారతీయ దృక్పథంతో సమగ్ర అభివృద్ధి" అనే థీమ్‌తో విజ్ఞాన భారతి ఈ నాలుగు రోజుల జాతీయ సైన్స్ సదస్సును నిర్వహిస్తోంది. ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని, ఆధునిక శాస్త్రీయ పరిశోధనలతో అనుసంధానించడమే ఈ సదస్సు ముఖ్య లక్ష్యం.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, విజ్ఞాన సంపదను పిల్లలకు అందించాలని పిలుపునిచ్చారు. "పిల్లలకు స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ గురించి కాదు, మన హనుమంతుడి గురించి చెప్పండి. రాముడు, కృష్ణుడు, శివుడి గురించి బోధించండి. రాక్షసుల స్వభావం కూడా వివరించాలి," అని అన్నారు. ప్రాచీన కాలంలో భారతదేశం ఒక విజ్ఞాన ఖని అని, వేల ఏళ్ల క్రితమే హరప్పా నాగరికత అద్భుతమైన పట్టణ ప్రణాళికను ప్రపంచానికి చూపిందని గుర్తుచేశారు. "సంఖ్యా వ్యవస్థకు కీలకమైన సున్నాను కనుగొన్నది భారతీయులే. ఈ ఆవిష్కరణ ప్రపంచ చరిత్రనే మార్చేసింది. మెదడుకు పదును పెట్టే చదరంగం ఆటను కనిపెట్టింది కూడా మనమే," అని ఆయన వివరించారు.

ఈ సదస్సుకు హాజరయ్యే ముందు, మోహన్ భగవత్ గురువారం సాయంత్రమే తిరుపతికి చేరుకున్నారు. ఆయన మొదట శ్రీ భూ వరాహ స్వామిని, ఆ తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ సాధారణ భక్తులతో కలిసి శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించడం విశేషం. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేసి సత్కరించారు.

దక్షిణ భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సు డిసెంబర్ 26 నుంచి 29 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ డైరెక్టర్లు, ఇస్రో, డీఆర్‌డీఓ, సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు, వైస్-ఛాన్సలర్లు సహా సుమారు 1,500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. ఇస్రో, డీఆర్‌డీఓ వంటి ఆధునిక సంస్థలతో పాటు, సంప్రదాయ కళాకారుల ఆవిష్కరణలతో కూడిన 'సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పో' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను పునరుద్ఘాటించారు. విశాఖపట్నంను డేటా సెంటర్ హబ్‌గా, అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ హబ్‌గా, తిరుపతిని 'స్పేస్ సిటీ'గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం తిరుపతిలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించి, ఉండవల్లికి తిరిగి వెళ్లనున్నారు. ఈ నెల 29న జరిగే ముగింపు కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
Mohan Bhagwat
RSS Chief
Tirumala
Chandrababu Naidu
Jitendra Singh
TTD
Sri Venkateswara Swamy
National Sanskrit University
Vedic Science
Hinduism

More Telugu News