Mylardevpally Accident: తెలంగాణలో ఘోర ప్రమాదం.. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు, ఒకరి మృతి

Mylardevpally Accident One Dead as Car Rams into Sleeping People
  • మైలార్‌దేవ్‌పల్లిలో  ఘటన 
  • అక్కడికక్కడే ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
  • ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుల కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం
  • అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ
హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపుతప్పిన ఓ ఇన్నోవా కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వలస వచ్చి జీవనం సాగిస్తున్న ఓ కుటుంబంలో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
 
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రభు మహరాజ్ తన ఇద్దరు కుమారులతో కలిసి నగరానికి వలస వచ్చాడు. రోడ్డు పక్కన దుప్పట్లు, రగ్గులు అమ్ముకుంటూ జీవిస్తున్న వీరు, రాత్రిపూట తమ దుకాణం వద్దే ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నారు. శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు, అతివేగం కారణంగా అదుపుతప్పి నేరుగా వీరిపైకి దూసుకెళ్లింది.
 
ఈ ప్రమాదంలో ప్రభు మహరాజ్ కుమారుడు దీపక్ అక్కడికక్కడే మరణించాడు. తండ్రి ప్రభు మహరాజ్, మరో కుమారుడు సత్తునాథ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
 
ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్లు తెలిసింది. ఘటన అనంతరం వారిలో ముగ్గురు పరారవ్వగా, మిగిలిన ముగ్గురిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ఈ ఘోరానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
 
Mylardevpally Accident
Hyderabad Road Accident
Telangana Accident
Road Accident
Innova Car Accident
Mylardevpally
Hit and Run
Road Safety India

More Telugu News