Ambati Rambabu: చంద్రబాబు ఏం చెబితే పవన్ అదే మాట్లాడుతున్నారు: అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు

Ambati Rambabu Fires Again on Pawan Kalyan
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టుగానే పవన్ కల్యాణ్ ఒక వికృత క్రీడ ఆడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఏం చెబితే పవన్ అదే మాట్లాడుతున్నారని, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

"పవన్ కల్యాణ్‌కు ఏది కావాలో చంద్రబాబు అది ఇస్తారు. అందుకే ఆయన చెప్పినట్టుగానే పవన్ నడుచుకుంటున్నారు" అని అంబటి ఆరోపించారు. కూటమి నేతలు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం వల్లే గతంలో తిరుమలలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది చనిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. "తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని ఎవరు పడగొట్టారు? గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోతే అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు?" అని నిలదీశారు. విజయవాడలో చంద్రబాబు హయాంలో కూల్చిన గుళ్లను జగన్ తిరిగి కట్టించారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో లోకేశ్ ఒక అజ్ఞాని అనుకుంటే, పవన్ కల్యాణ్ అంతకంటే పెద్ద అజ్ఞానిగా మారుతున్నారని అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Ambati Rambabu
Pawan Kalyan
Andhra Pradesh
Chandrababu Naidu
YSRCP
Politics
Tirumala
Godavari Pushkaralu
Lokesh
Political Criticism

More Telugu News