Shashi Tharoor: వీర్ సావర్కర్ అవార్డును తిరస్కరించిన శశి థరూర్

Shashi Tharoor Rejects Veer Savarkar Award
  • వీర్ సావర్కర్ పేరిట అవార్డుకు ఎంపికైన శశి థరూర్
  • సంస్థ, అవార్డు స్వరూపంపై స్పష్టత లేదన్న థరూర్
  • తనను సంప్రదించకుండానే పేరు ప్రకటించారని విమర్శ
కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్.. వీర్ సావర్కర్ పేరిట ఏర్పాటు చేసిన అవార్డును తిరస్కరించారు. ఓ ఎన్జీవో సంస్థ ప్రకటించిన ఈ పురస్కారాన్ని స్వీకరించేందుకు ఆయన నిరాకరించారు. 

హైరేంజ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌ఆర్‌డీఎస్) అనే ఎన్జీవో.. 'వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ అవార్డు 2025'ను ఏర్పాటు చేసింది. తొలి పురస్కారానికి థరూర్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. అయితే, ఈ విషయంపై థరూర్ స్పందిస్తూ.. అవార్డు స్వరూపం, దానిని అందిస్తున్న సంస్థ లేదా ఇతర వివరాలపై ఎలాంటి స్పష్టత లేదని తెలిపారు. అందువల్ల, కార్యక్రమానికి హాజరయ్యే లేదా అవార్డును స్వీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

తన అనుమతి లేకుండా తన పేరును ప్రకటించడం నిర్వాహకుల బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. ఈ అవార్డు గురించి తనకు నిన్న కేరళలో ఉండగా మీడియా ద్వారానే తెలిసిందని అన్నారు.

వీర్ సావర్కర్‌ను బీజేపీ, దాని అనుబంధ సంస్థలు గొప్ప దేశభక్తుడిగా భావిస్తాయి. కానీ, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్రపై కాంగ్రెస్ పార్టీకి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సావర్కర్ పేరిట ఉన్న అవార్డును స్వీకరిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుందని కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కె. మురళీధరన్ వంటి వారు అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలో నేడు జరిగే ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. ఇటీవల కాలంలో పార్టీ వైఖరిని విమర్శిస్తూ వార్తల్లో నిలిచినప్పటికీ, సావర్కర్ విషయంలో మాత్రం థరూర్ పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడినట్లు ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.
Shashi Tharoor
Veer Savarkar
HRDS
Congress Party
Rajnath Singh
Kerala
Award Rejection
Political Controversy

More Telugu News