జైల్లో అనుచరులపై దర్శన్ దాడి... టార్చర్ భరించలేక ఫిర్యాదు
- నిద్రపోతున్న వారిని తన్నుతూ, దురుసుగా ప్రవర్తిస్తున్న కన్నడ స్టార్
- తమను మరో జైలుకు మార్చాలని అధికారులను కోరిన ఇద్దరు అనుచరులు
- జైల్లో కఠిన నిబంధనలతో దర్శన్లో పెరిగిన అసహనం
- దర్శన్ బ్యారక్ వద్ద సీసీటీవీలతో భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు
అధికార వర్గాల సమాచారం ప్రకారం, జైలు అధికారులు దర్శన్కు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను రద్దు చేసి, నిబంధనలు కఠినతరం చేసినప్పటి నుంచి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. సహ నిందితులు నిద్రపోతున్నప్పుడు వారిని కాలితో తన్నడం, వారితో దురుసుగా మాట్లాడటం వంటివి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేధింపులు భరించలేని అతడి అనుచరులు జగదీశ్, అనుకుమార్ తమను చిత్రదుర్గ జైలుకు మార్చాలని జైలు అధికారులను అభ్యర్థించారు. న్యాయవాదుల నియామకం విషయంలో కూడా దర్శన్కు, సహ నిందితులకు మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం.
జైలు చీఫ్ సూపరింటెండెంట్గా ఐపీఎస్ అధికారి అన్షు కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిబంధనలు కఠినతరం చేశారు. దీంతో దర్శన్ కూడా అందరిలాగే క్యూలో నిలబడి ఆహారం తీసుకోవాల్సి వస్తుండటంతో పాటు, టాయిలెట్ కూడా శుభ్రం చేయాల్సి వస్తోంది. ఈ పరిణామాలతో ఆయన తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శన్, అతని అనుచరులు ఉన్న బ్యారక్ వద్ద అధికారులు అదనపు భద్రత ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలు, బారికేడ్లు ఏర్పాటు చేసి నిఘా పెంచారు.
తన అభిమాని రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, కిరాతకంగా హత్య చేశారన్న ఆరోపణలతో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ సహా 17 మందిని 2024 జూన్ 11న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్శన్పై ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 120-బి (కుట్ర) సహా పలు తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి.