Air India: ఇండిగో సంక్షోభం... టికెట్ ధరలకు కళ్లెం వేసిన ఎయిరిండియా

Air India Caps Ticket Prices Amid Indigo Crisis
  • ఇండిగో సంక్షోభంతో ఆకాశాన్నంటిన విమాన ఛార్జీలు
  • టికెట్ ధరలపై పరిమితి విధిస్తూ ఎయిరిండియా నిర్ణయం
  • ధరల నియంత్రణకు రంగంలోకి దిగిన కేంద్ర పౌర విమానయాన శాఖ
  • రీఫండ్లు, బ్యాగేజీపై ఇండిగోకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు
  • అన్ని విమానయాన సంస్థలకు వర్తించనున్న ధరల నియంత్రణ
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన కార్యాచరణ సంక్షోభం కారణంగా దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై భారం పడకుండా చూసేందుకు ఎయిరిండియా, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాయి. విమాన టికెట్ ధరలపై పరిమితులు విధిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

ఇండిగో సమస్యల వల్ల డిమాండ్-సప్లై మధ్య ఏర్పడిన అంతరాన్ని ఆసరాగా చేసుకుని టికెట్ ధరలు విపరీతంగా పెరగడంతో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. డిసెంబర్ 4 నుంచే దేశీయ నాన్‌-స్టాప్ విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధరలపై గరిష్ఠ పరిమితిని విధించినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి. సాధారణంగా రెవిన్యూ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు డిమాండ్‌కు అనుగుణంగా ధరలను పెంచుతాయని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా జరగకుండా నివారించేందుకే ఈ చర్యలు తీసుకున్నామని ఎయిర్ ఇండియా ప్రతినిధి వివరించారు.

అయితే, థర్డ్-పార్టీ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే వన్-స్టాప్ లేదా టూ-స్టాప్ విమానాలు, అలాగే ఎకానమీతో పాటు ప్రీమియం ఎకానమీ లేదా బిజినెస్ క్లాస్ కలిపి బుక్ చేసే ప్రయాణాలపై పరిమితులు విధించడం సాంకేతికంగా సాధ్యం కాదని ఎయిరిండియా సంస్థ స్పష్టం చేసింది. అయినప్పటికీ, అలాంటి ప్లాట్‌ఫామ్‌లతో మాట్లాడి ధరలను అదుపులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. ప్రయాణికులు, వారి లగేజీని వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అదనపు సామర్థ్యాన్ని జోడించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.

రంగంలోకి దిగిన కేంద్రం... ఇండిగోకు కీలక ఆదేశాలు

మరోవైపు, ఈ వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. తన నియంత్రణ అధికారాలను ఉపయోగించి, ప్రభావిత మార్గాల్లో అన్ని విమానయాన సంస్థలు తప్పనిసరిగా సరసమైన ఛార్జీలనే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ఈ ధరల పరిమితులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇండిగో సంస్థకు పలు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రద్దయిన లేదా ఆలస్యమైన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు ఇవ్వాల్సిన రిఫండ్లన్నీ ఆదివారం రాత్రి 8 గంటల కల్లా పూర్తి చేయాలని గడువు విధించినట్లు చెప్పారు. 

అలాగే, ప్రయాణికులకు దూరమైన లగేజీని గుర్తించి, రాబోయే 48 గంటల్లో వారి ఇళ్లకు లేదా వారు కోరుకున్న చిరునామాకు చేర్చాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రియల్ టైమ్ డేటా ద్వారా విమాన ఛార్జీలను నిశితంగా గమనిస్తున్నామని, ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.
Air India
Indigo crisis
flight tickets
Rammohan Naidu
aviation ministry
ticket prices
domestic flights
Air India Express
aviation sector

More Telugu News