పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం... హైకోర్టుకు నివేదిక సమర్పించిన సిట్
- సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించిన సిట్ బృందం
- లోక్ అదాలత్లో కేసు పరిష్కారంపై హైకోర్టు ఆదేశాలతో విచారణ
- మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించిన సిట్
- శుక్రవారం కేసుపై తదుపరి విచారణ జరపనున్న హైకోర్టు
2023 ఏప్రిల్లో తిరుమల పరకామణిలో టీటీడీ ఉద్యోగి రవికుమార్ 920 డాలర్లు దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే, అనూహ్యంగా ఈ కేసును లోక్ అదాలత్కు బదిలీ చేశారు. నిందితుడు రవికుమార్ తనకు చెందిన రూ.40 కోట్ల విలువైన ఏడు ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇవ్వడంతో, 2023 సెప్టెంబర్లో కేసును రాజీ ఫార్ములాతో మూసివేశారు.
అయితే, చిన్న దొంగతనం కేసుకు ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు విరాళంగా ఇచ్చి కేసును మూసివేయించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై మాచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోక్ అదాలత్లో కేసును పరిష్కరించడాన్ని సవాలు చేస్తూ, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు, కేసుపై దర్యాప్తు చేయాలని ఆదేశించడంతో సిట్ విచారణ ప్రారంభించింది.
ఈ విచారణలో భాగంగా సిట్ అధికారులు.. కేసు నమోదైనప్పుడు టీటీడీ ఛైర్మన్గా ఉన్న బి. కరుణాకర్ రెడ్డి, లోక్ అదాలత్లో పరిష్కారం జరిగినప్పుడు టీటీడీ ఛైర్మన్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని, మాజీ ఈవో ధర్మారెడ్డితో పాటు పలువురు టీటీడీ, పోలీసు అధికారులను ప్రశ్నించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఇప్పుడు సిట్ సమర్పించిన నివేదిక ఆధారంగా హైకోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.