ముత్తుసామి సెంచరీ, యన్సెన్ మెరుపులు... తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 489 ఆలౌట్
- గౌహతిలో జరుగుతున్న రెండో టెస్టు
- శతకంతో కదం తొక్కిన సెనురన్ ముత్తుసామి (109)
- మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న మార్కో యన్సెన్ (93)
- భారత బౌలర్లలో నాలుగు వికెట్లతో రాణించిన కుల్దీప్ యాదవ్
- టీమిండియా ముందు భారీ స్కోరును ఉంచిన సఫారీ జట్టు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలినా, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా ఎనిమిదో వికెట్కు ముత్తుసామి, జాన్సెన్ కలిసి 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. కేవలం 91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేసిన యన్సెన్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. ముత్తుసామి మాత్రం ఓపికగా ఆడి తన టెస్ట్ కెరీర్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 115 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అతనికి తోడుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించిన దక్షిణాఫ్రికా, మ్యాచ్పై పట్టు బిగించింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2 బ్యాటింగ్), యశస్వి జైస్వాల్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సఫారీల తొలి ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా ఇంకా 480 పరుగులు వెనుకబడి ఉంది. రేపు ఆటకు మూడో రోజు భారత బ్యాటర్లు ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.