జైల్లో ఖైదీల సేంద్రియ వ్యవసాయం... నెలకు రూ.1.20 లక్షల ఆదాయం
- రాజమహేంద్రవరం జైల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఖైదీలు
- కూరగాయల అమ్మకంతో నెలకు రూ.1.20 లక్షల ఆదాయం
- 80 పశువులతో డెయిరీ నిర్వహణ, పాల ఉత్పత్తి
- ఉపాధితో పాటు ఖైదీల పునరావాసానికి తోడ్పాటు
జైలు ప్రాంగణంలోని ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో 20 మంది ఖైదీలు ఈ సేంద్రియ సాగు బాధ్యతలు చూస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఇలా పండించిన ఉత్పత్తుల ద్వారా నెలకు రూ.1.20 లక్షల ఆదాయం వస్తుండగా, అందులో లక్ష రూపాయల విలువైన కూరగాయలను బయట ప్రజలకు విక్రయిస్తున్నారు. మిగిలిన రూ.20 వేల విలువైన ఉత్పత్తులను జైల్లోని ఖైదీల ఆహార అవసరాలకు వినియోగిస్తున్నారు.
కేవలం వ్యవసాయమే కాకుండా జైలు అధికారులు ఓ డెయిరీని కూడా సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఇందులో 80 పశువులు ఉండగా, రోజూ సుమారు 200 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పాలను పూర్తిగా ఖైదీల అవసరాలకే వాడుతున్నారు. పశువుల కోసం ఆరెకరాల్లో గడ్డిని కూడా పెంచుతున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ఖైదీలకు ఉపాధి దొరకడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి, పునరావాసానికి మార్గం సుగమం అవుతోంది. రాజమహేంద్రవరం జైలుతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని కారాగారాల్లోనూ ఖైదీలతో పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. జైళ్ల శాఖ అమలు చేస్తున్న ఈ సంస్కరణలపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.