Sathya Sai Baba: సత్యసాయి శత జయంతి: పుట్టపర్తికి 200 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

Sathya Sai Baba Centenary 200 Special RTC Buses to Puttaparthi
  • పుట్టపర్తిలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టుతో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు భేటీ
  • భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు లేకుండా చర్యలు
  • సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు ఈ నెల 23న పుట్టపర్తిలో ప్రారంభం 
శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా 200 ప్రత్యేక బస్సులు పుట్టపర్తికి నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. నిన్న ఆయన శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిని సందర్శించి, వేడుకల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.
 
ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు ప్రశాంతి నిలయంలోని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రతినిధులతో సమావేశమయ్యారు. శత జయంతి వేడుకలకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆయన స్థానిక ఆర్టీసీ డిపో, బస్టాండును అధికారులతో కలిసి పరిశీలించారు.
 
శత జయంతి ఉత్సవాలకు పుట్టపర్తికి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని సర్వీసులు నడిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. 

కాగా, శ్రీసత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు ఈ నెల 23న పుట్టపర్తిలో అధికారికంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను రాష్ట్ర పండుగగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో 185 దేశాలకు చెందిన వారు పాల్గొంటారు. ఈ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు డిప్యూటీ సీఎంలు, మంత్రులు పాల్గొంటారు.  
Sathya Sai Baba
Puttaparthi
APSRTC
Special buses
Sathya Sai Centenary
APSRTC MD Dwaraka Tirumala Rao
Prasanthi Nilayam
Sri Sathya Sai district
Narendra Modi
Droupadi Murmu

More Telugu News