Amit Shah: ఈవీఎంలు గట్టిగా నొక్కండి... ఆ మోత ఇటలీ దాకా వినపడాలి: అమిత్ షా

Amit Shah Slams Lalu Rabri Rule in Bihar Election Rally
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
  • లాలూ-రబ్రీ దేవిల పాలన 'జంగిల్ రాజ్' అంటూ అమిత్ షా తీవ్ర విమర్శ
  • కొడుకులను ప్రధాని, సీఎం చేయాలని సోనియా, లాలూ చూస్తున్నారని ఎద్దేవా
  • ఎన్డీఏ అధికారంలోకి వస్తే మూతపడిన చక్కెర మిల్లులు తెరిపిస్తామని హామీ
  • జీవికా దీదీలకు అదనంగా రూ. 2 లక్షలు అందిస్తామని భరోసా
  • బీహార్‌లో శాంతిభద్రతలను ఎన్డీఏనే కాపాడిందని వ్యాఖ్య
బీహార్‌లో మళ్లీ 'జంగిల్ రాజ్' (అరాచక పాలన)ను ప్రజలు కోరుకోవడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిల పాలనలో రాష్ట్రం అరాచకంగా మారిందని, ఆ చీకటి రోజులను ఎవరూ మర్చిపోలేరని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం పశ్చిమ చంపారన్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. "నవంబర్ 6, 11 తేదీల్లో ఈవీఎం బటన్‌ను ఎంత గట్టిగా నొక్కాలంటే, ఆ మోత ఇటలీలో ప్రతిధ్వనించాలి" అంటూ ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు.

1990లు, 2000ల ప్రారంభంలో రాష్ట్రంలో నేరాలు, అరాచకాలు పెరిగిపోయాయని గుర్తుచేసిన అమిత్ షా, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. లాలూ-రబ్రీ హయాంలోనే రాష్ట్రంలోని అనేక చక్కెర మిల్లులు మూతపడ్డాయని ఆరోపించారు. మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే, మూతపడిన అన్ని మిల్లులను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్‌లను లక్ష్యంగా చేసుకుని అమిత్ షా విమర్శలు గుప్పించారు. "ఒక నాయకురాలు తన కొడుకును ప్రధానమంత్రిని చేయాలని చూస్తుంటే, మరో నాయకుడు తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని ఆరాటపడుతున్నారు. కానీ ఢిల్లీలో గానీ, పాట్నాలో గానీ కుర్చీలు ఖాళీగా లేవని వారు గుర్తుంచుకోవాలి" అని ఆయన ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ, 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని, ఆర్టికల్ 370 రద్దు కూడా అందులో భాగమేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కొందరు నేర చరితులను వెనకేసుకొస్తున్నాయని, అలాంటి శక్తులను ఓటర్లు తిరస్కరించాలని కోరారు. 'జీవికా దీదీ'ల (మహిళా స్వయం సహాయక బృందాలు) విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారు ప్రభుత్వానికి ఎలాంటి డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, ప్రతి జీవికా దీదీకి అదనంగా రూ. 2 లక్షలు అందిస్తామని ప్రకటించారు.

సిక్తా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి సమృధ్ వర్మకు మద్దతుగా అమిత్ షా ఈ ప్రచారం నిర్వహించారు. మంగళవారం సాయంత్రంతో తొలి దశ ఎన్నికల ప్రచారం ముగియనుండగా, నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. 
Amit Shah
Bihar Election
Jungle Raj
Lalu Prasad Yadav
Rabri Devi
NDA
Sonia Gandhi
Rahul Gandhi
West Champaran
EVM

More Telugu News