ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు.. కన్నుమూసి తెరిచేలోపు ఘోరం జరిగింది: బస్సు ప్రమాదంపై కండక్టర్

Telangana Bus Accident Conductor Recounts Horror
  • చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లోడుతో వెళుతున్న లారీ
  • ప్రమాదంలో స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్న కండక్టర్
  • బస్సులో పోలీసులు, ఉద్యోగులు సహా 72 మంది ప్రయాణికులు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై బస్సు కండక్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మీర్జాగూడ వద్దకు బస్సు రాగానే ఏం జరుగుతుందో క్షణంపాటు అర్థం కాలేదని, కన్నుమూసి తెరిచేలోపు ఘోరం జరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కండక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియాతో మాట్లాడుతూ, బస్సులో పోలీసులు, ఉద్యోగులు సహా మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నారని ఆయన తెలిపారు.

హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి 163పై మీర్జాగూడ వద్ద ఈ రోజు ఉదయం తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు.

ఈ దుర్ఘటనలో వికారాబాద్ జిల్లా యాలాల మండలం హాజీపూర్‌కు చెందిన బండప్ప, లక్ష్మీ దంపతులు మృతి చెందారు. దీంతో వారి కుమార్తెలు భవాని, శివలీల అనాథలయ్యారు. తల్లిదండ్రుల మరణంతో ఆ చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటంతో అక్కడున్న వారి హృదయాలు బరువెక్కాయి.
Go Back to Shorts
Bus Accident
Telangana Bus Accident
Hyderabad Bijapur Highway
Road Accident India
Chevela Bus Accident

More Telugu News