బీహార్ లో తన సొంత పార్టీ జన్ సురాజ్ కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన ప్రశాంత్ కిశోర్
- జన్ సురాజ్కు 150కి పైగా లేదా 10 లోపు సీట్లు వస్తాయని జోస్యం
- ఎన్నికలకు ముందు, తర్వాత ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం
- ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని వ్యాఖ్య
ఎన్నికలకు ముందుగానీ, ఎన్నికల తర్వాత గానీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని పీకే తేల్చి చెప్పారు. "ప్రస్తుతం బీహార్లోని 160-170 స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. మా పార్టీ 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందన్న పూర్తి విశ్వాసం నాకుంది. రాష్ట్ర ప్రజలు జన్ సురాజ్ను ఓ బలమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాను ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పట్ల ప్రజల్లో కొంత నిరాశ ఉందని పీకే అంగీకరించారు. అయితే, తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎప్పుడూ చెప్పలేదని గుర్తుచేశారు. "ఒకవేళ పోటీ చేస్తే కార్గఢ్ నుంచి చేస్తానని గతంలో అన్నాను. కానీ, అది కూడా నిజం కాదని అప్పుడే స్పష్టం చేశాను" అని తెలిపారు. బీహార్లోని మూడింట ఒక వంతు ప్రజలు ప్రస్తుత అధికార, ప్రతిపక్ష కూటములకు ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారని, వారికి తమ పార్టీయే సరైన ప్రత్యామ్నాయమని పీకే వివరించారు.
కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో జన్ సురాజ్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.