ఢిల్లీలో పాకిస్థాన్ ఐఎస్ఐ 'అణు' గూఢచర్య నెట్వర్క్ బట్టబయలు
- మహమ్మద్ ఆదిల్ హుస్సైనీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన స్పెషల్ సెల్
- బార్క్లోకి చొరబడేందుకు విఫలయత్నం చేసినట్లు గుర్తింపు
- కేసుపై కొనసాగుతున్న ఢిల్లీ పోలీసుల దర్యాప్తు
వివరాల్లోకి వెళితే, ఢిల్లీ పోలీసులు చేపట్టిన కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో భాగంగా 59 ఏళ్ల మహమ్మద్ ఆదిల్ హుస్సైనీని అరెస్ట్ చేశారు. ఇతడితో పాటు నసీముద్దీన్ అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గూఢచర్యం, నకిలీ పాస్పోర్ట్ రాకెట్ వంటి ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఝార్ఖండ్లోని జంషెడ్పూర్ నివాసి అయిన హుస్సైనీ, పాకిస్థాన్ ఐఎస్ఐతో పాటు ఇరాన్కు చెందిన అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్, ఓ రష్యన్ అణు నిపుణుడితో సంబంధాలు కొనసాగించినట్లు తేలింది.
పోలీసుల విచారణలో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. శాస్త్రవేత్తగా నటిస్తూ తన సోదరుడితో కలిసి భారతదేశ అగ్రగామి అణు పరిశోధనా సంస్థ అయిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లోకి చొరబడేందుకు ప్రయత్నించినట్లు అంగీకరించాడు. అంతేకాకుండా, రష్యాకు చెందిన ఓ శాస్త్రవేత్త నుంచి అణు సంబంధిత డిజైన్లను సేకరించి, వాటిని ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్కు చెందిన ఏజెంట్కు విక్రయించినట్లు ఒప్పుకున్నాడు.
ఈ అరెస్ట్తో దేశ భద్రతకు సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, వారి కార్యకలాపాలు ఏ మేరకు విస్తరించాయి అనే కోణంలో ఢిల్లీ పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.