తెలంగాణలో నవంబరు 3 నుంచి ప్రైవేట్ కళాశాలల బంద్!
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ కాలేజీల ఆందోళన
- నవంబర్ 3 నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన సమాఖ్య
- ప్రభుత్వం నుంచి రూ. 900 కోట్లు రావాల్సి ఉందని వెల్లడి
- నవంబర్ 1 లోగా బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి డెడ్లైన్
- మంత్రులు పట్టించుకోవడం లేదన్న సమాఖ్య ఛైర్మన్ రమేశ్ బాబు
- బకాయిలు చెల్లించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక
ప్రభుత్వం తమకు మొత్తం రూ. 1200 కోట్ల ఫీజు బకాయిలు ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ. 300 కోట్లు మాత్రమే విడుదల చేసిందని రమేశ్ బాబు తెలిపారు. మిగిలిన రూ. 900 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. "ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహకారం అందడం లేదు. మంత్రులు కూడా మా సమస్యలను పట్టించుకోవడం లేదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకపోతే కాలేజీలను నడపడం కష్టమని, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని రమేశ్ బాబు హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే నవంబర్ 10వ తేదీన సుమారు 2 లక్షల మందితో భారీ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. విచారణల పేరుతో ప్రభుత్వం తమను భయపెట్టాలని చూస్తోందని, పోలీసులను పంపితే ఒక్కరిని కూడా కాలేజీ ప్రాంగణంలోకి అనుమతించబోమని ఆయన తేల్చిచెప్పారు.