APSDMA: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... ఈ నెల 27 నాటికి తుపాను

IMD Warns of Cyclone Forming in Bay of Bengal
  • శనివారానికి వాయుగుండంగా మారే అవకాశం
  • సోమవారం నాటికి మరరింత బలపడి తుపానుగా రూపాంతరం
  • మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ సూచన
  • తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడి
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది వేగంగా బలపడుతోందని, రానున్న 72 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

శుక్రవారం ఉదయం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం, పశ్చిమ-వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. ఇది మరింత బలపడి అక్టోబర్ 25 (శనివారం) నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 26 (ఆదివారం) నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. అక్టోబర్ 27 (సోమవారం) ఉదయానికి నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఇది తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఈ తుపాను ప్రభావంపై ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ కీలక వివరాలు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, సోమవారం అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
APSDMA
Andhra Pradesh
Cyclone
Bay of Bengal
Heavy Rains
Weather Forecast
IMD
Fishermen Warning
Prakhar Jain
AP State Disaster Management Authority

More Telugu News