మారిన తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్.. ఫిబ్రవరి చివరిలోనే నిర్వహణ
- ఫిబ్రవరి 25 నుంచి ఫస్టియర్, 26 నుంచి సెకండియర్ పరీక్షల ప్రారంభం
- ఇంటర్ బోర్డు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- ఎంసెట్, ఐఐటీ వంటి పోటీ పరీక్షల ప్రిపరేషన్కు విద్యార్థులకు మేలు
- ప్రాక్టికల్స్కు, ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లకు కొత్త ఫీజుల ఖరారు
- జనవరి చివరి వారంలో ప్రారంభం కానున్న ప్రాక్టికల్ పరీక్షలు
సాధారణంగా ప్రతి ఏటా మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు ఈసారి ఫిబ్రవరి చివరి వారంలోనే మొదలుకానున్నాయి. విడుదలైన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. గత విద్యా సంవత్సరంలో ఈ పరీక్షలు మార్చి 5న ప్రారంభమైన విషయం తెలిసిందే.
పరీక్షలను ముందుగా పూర్తి చేయడం వల్ల ఫలితాలు కూడా త్వరగా వెలువడతాయి. ఇది వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియపై దృష్టి సారించేందుకు అధ్యాపకులకు వెసులుబాటు కల్పిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రాక్టికల్స్, ఫీజుల వివరాలు
థియరీ పరీక్షలకు ముందుగా జరిగే ప్రాక్టికల్ పరీక్షలను జనవరి చివరి వారంలో ప్రారంభించి, ఫిబ్రవరి మొదటి వారంలోగా రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో పూర్తి చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
దీంతో పాటు ఫీజుల విషయంలోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి నుంచి రూ. 30 వసూలు చేయనున్నారు. అలాగే ప్రైవేటు కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల నుంచి రికగ్నిషన్ ఫీజు కింద రూ. 220, గ్రీన్ ఫండ్ కోసం రూ. 15 చొప్పున వసూలు చేయాలని ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు.