సోషల్ మీడియాలో ఏది నిజమో.. ఏది నకిలీనో ఇకపై సులువుగా తెలుసుకోవచ్చు!
- ఏఐ, డీప్ఫేక్ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు
- ఐటీ నిబంధనలు 2021కు సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా విడుదల
- సోషల్ మీడియాలోని ఏఐ కంటెంట్కు లేబుల్ తప్పనిసరి
- వీడియో, ఆడియోలలో స్పష్టంగా కనిపించేలా ప్రత్యేక గుర్తింపు ఉండాలి
- తప్పుడు సమాచారం, మోసాలను అరికట్టడమే ప్రధాన లక్ష్యం
ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలు తమ ప్లాట్ఫారమ్లపై పోస్ట్ చేసే ఏఐ కంటెంట్ను స్పష్టంగా గుర్తించాల్సి ఉంటుంది. ఒక వీడియో లేదా ఇమేజ్ను ఏఐ ద్వారా రూపొందించినట్లయితే, దాని ఉపరితలంలో కనీసం 10 శాతం మేర ఈ కంటెంట్ "కృత్రిమంగా సృష్టించబడింది" అని తెలిపే లేబుల్ కనిపించాలి. అదే ఆడియో అయితే, దాని మొత్తం నిడివిలో కనీసం 10 శాతం పాటు ఈ విషయాన్ని వినిపించేలా స్పష్టం చేయాలి. ఈ ప్రత్యేక గుర్తింపును లేదా మెటాడేటాను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చడానికి, తొలగించడానికి వీల్లేదని ముసాయిదా స్పష్టం చేస్తోంది.
భారత్లో 50 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న అన్ని సోషల్ మీడియా సంస్థలు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఏఐ, డీప్ఫేక్ల ద్వారా ప్రజలను మోసగించడం, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి ప్రమాదాలను నివారించడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రిత్వశాఖ పేర్కొంది. సురక్షితమైన, నమ్మకమైన, జవాబుదారీతనం కలిగిన ఇంటర్నెట్ వాతావరణాన్ని అందించడమే తమ లక్ష్యమని తెలిపింది.
ఈ ముసాయిదాపై భాగస్వామ్య పక్షాలు, ప్రజల నుంచి అభిప్రాయాలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారు తమ సూచనలను నవంబర్ 6వ తేదీలోపు [email protected] ఈ-మెయిల్ ద్వారా పంపవచ్చని అధికారులు సూచించారు.