ప్రత్యర్ధులను బెదిరించేలా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు
- అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్న వారికి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవన్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
- తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యలు
- మూడో దీపావళిని వారు చేసుకుంటారో లేదో చూసుకోవాలన్న కేతిరెడ్డి
ధర్మవరం నియోజకవర్గంలోని పలువురు నాయకులు ఇటీవల వైసీపీ అధిష్ఠానం ద్వారా వివిధ విభాగాల్లో పదవులు పొందిన నేపథ్యంలో, నిన్న స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కేతిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్న వారికి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. మంచితో వచ్చే భక్తి కంటే భయంతో వచ్చే భక్తి ఎక్కువ కాలం ఉంటుందని, దానిని చూపిస్తానని అన్నారు.
వచ్చే మూడేళ్ల తర్వాత తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని, అప్పుడు 3.0 చూపిస్తానని హెచ్చరించారు. ఈ రెండేళ్లలో వారు ఏం మాట్లాడినా భరిస్తానని, కానీ మూడో దీపావళిని వారు చేసుకుంటారో లేదో చూసుకోవాలని వ్యాఖ్యానించారు. అలానే తన ప్రసంగంలో జగన్పై నమ్మకం వ్యక్తం చేస్తూ జగన్ 2.0 పరిపాలన చూస్తారని కేతిరెడ్డి అన్నారు. ప్రస్తుతం కేతిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.