కష్టాల్లో పద్మశ్రీ మొగులయ్య.. ఆదుకుంటానన్న కేటీఆర్
- బీఆర్ఎస్ నేత కేటీఆర్ను కలిసిన పద్మశ్రీ దర్శనం మొగులయ్య
- కంటి చూపు సమస్య.. వైద్యానికి కేటీఆర్ పూర్తి భరోసా
- హయత్నగర్ ఇంటి స్థలం వివాదంపై రంగారెడ్డి కలెక్టర్కు ఫోన్
ఈ సందర్భంగా మొగులయ్య యోగక్షేమాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. కొంతకాలంగా తన కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నానని మొగులయ్య చెప్పడంతో కేటీఆర్ వెంటనే స్పందించారు. హైదరాబాద్లోని ప్రఖ్యాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యం అందించే బాధ్యతను తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
అనంతరం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తనకు హయత్నగర్ మండలంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొందరు వ్యక్తులు సృష్టిస్తున్న ఇబ్బందులను మొగులయ్య కేటీఆర్కు వివరించారు. వారు కోర్టు కేసులతో వేధిస్తున్నారని, తాను నిర్మించుకున్న చిన్న గదిని సైతం కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తక్షణమే స్పందించిన కేటీఆర్, అక్కడికక్కడే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. మొగులయ్యకు కేటాయించిన భూమి విషయంలో న్యాయం చేయాలని, ఆయనకు, ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని సూచించారు. న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా పార్టీ తరఫున సహాయం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఒకప్పుడు అడవుల్లో కిన్నెర వాయించుకునే తనను గుర్తించి, ప్రపంచానికి పరిచయం చేసింది నాటి ముఖ్యమంత్రి కేసీఆరే అని మొగులయ్య గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ అందించిన ప్రోత్సాహం వల్లే తనకు పద్మశ్రీ పురస్కారం దక్కిందని, ఆయన చేసిన మేలును ఎప్పటికీ మరువలేనని కృతజ్ఞతలు తెలిపారు.