Samantha Ruth Prabhu: 'ఊ అంటావా' పాట చేయడానికి కారణం ఇదే: సమంత

Samantha Reveals Reason for Doing Oo Antava Song
  • తన వ్యక్తిగత జీవితం అంతా బహిరంగమేనన్న సమంత
  • బలహీనంగా కనిపిస్తే నిరంతరం ట్రోలింగ్ చేస్తుంటారని వ్యాఖ్యలు
  • 'ఊ అంటావా' పాటను ఒక ఛాలెంజ్ గా చేశానని వెల్లడి
  • యువత మెంటార్స్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలని సూచన
  • ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2025లో మాట్లాడిన నటి
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 'పుష్ప: ది రైజ్' చిత్రంలో అల్లు అర్జున్‌తో కలిసి ఆమె చేసిన 'ఊ అంటావా' పాట దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఆ పాటను తాను ఎందుకు చేయాల్సి వచ్చిందో సమంత తాజాగా వెల్లడించారు. అదొక సవాలుగా స్వీకరించి ఆ పాటలో నటించినట్లు తెలిపారు.

ఇటీవల జరిగిన 'ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2025'లో పాల్గొన్న సమంత పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా 'ఊ అంటావా' పాట ప్రస్తావన రాగా, "'ఆ పాటను నేనొక ఛాలెంజ్‌గా తీసుకుని చేశాను. నేను చేయగలనో లేదో చూసుకోవాలనుకున్నాను. నన్ను నేను ఎప్పుడూ సెక్సీగా భావించలేదు. నాకు ఎవరూ బోల్డ్ పాత్రలు ఇవ్వరని తెలుసు. అందుకే ఒక్కసారి ప్రయత్నించాను" అని సమంత వివరించారు.

అదే సమయంలో, తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, వాటివల్ల ఎదురైన ఇబ్బందుల గురించి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "నా ప్రయాణాన్ని గమనిస్తున్న ప్రతి ఒక్కరికీ నా వ్యక్తిగత ఇబ్బందుల గురించి తెలుసు. నా విడాకులు, అనారోగ్యం.. ఇలా ప్రతీది ప్రజల ముందు ఉంది. మనం బలహీనంగా కనిపించినప్పుడు నిరంతరం జడ్జ్ చేస్తారు, ట్రోల్ చేస్తారు" అని ఆమె తన బాధను పంచుకున్నారు.

అంతేకాకుండా, యువతకు ఆశయాలు ఉండాలని, అయితే ఆ ఆశయాలకు ఒక ఉద్దేశం కూడా జతకావాలని సమంత సూచించారు. "నాకు ఆశయాలు ఎక్కువ. యువత తమ మెంటార్స్‌ను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. నా జీవితాన్ని మార్చేసిన మెంటార్స్‌ను నేను జాగ్రత్తగా ఎంచుకున్నాను. అందుకే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా బాధ్యతగా ఉండాలి" అని సమంత పేర్కొన్నారు. కాగా, ఆమె చివరిసారిగా 2024లో విడుదలైన 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌లో కనిపించారు.
Samantha Ruth Prabhu
Samantha
Oo Antava
Pushpa
Allu Arjun
NDTV World Summit 2025
Citadel Honey Bunny
divorce
challenges
Tollywood

More Telugu News