హైదరాబాద్లోని పలు ఫారెక్స్ సంస్థల్లో ఈడీ తనిఖీలు
- ఆర్బీఐ లైసెన్స్ లేకుండా సంస్థలను నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు
- ప్రిజమ్, గరుడ, విక్టరీ, విమల్నాథ్ ఫారెక్స్ సంస్థల్లో సోదాలు
- పలు సంస్థలు అక్రమంగా డబ్బు మార్పిడి వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడి
గతంలో ఆర్బీఐ అధికారులు జరిపిన సోదాల్లో ఈ సంస్థల్లో అవకతవకలు వెలుగుచూడటంతో, ఈడీ కూడా తనిఖీలు చేపట్టింది. ఆర్బీఐ అనుమతులు లేకుండా, బోగస్ పత్రాలతో ఈ సంస్థలు నిర్వహిస్తున్నట్లు సోదాల్లో తేలింది.
కొన్ని ఫారెక్స్ సంస్థలు అక్రమంగా డబ్బు మార్పిడి వ్యాపారం చేస్తున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. పలు సంస్థలు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. ఈ దాడుల్లో నకిలీ పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లతో పాటు రూ. 11.99 లక్షల నగదు, రూ. 26.77 లక్షల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.